పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వ కృషి..

343
b vinod kumar
- Advertisement -

రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.హైదరాబాద్ లోని నిజాంపేటలో ప్రభుత్వ సహకార రంగ కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల డైయిరీ నగర 54వ పంపిణీ కేంద్రాన్ని వినోద్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డైయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వరరావు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి, హైదరాబాద్ నగర మార్కెటింగ్ ఇంచార్జీలు శ్రీనివాస్, పూర్ణచందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి రోజు 80 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో సగభాగం 40 లక్షల లీటర్ల పాలు మాత్రమే మార్కెట్ కు వస్తోందని పేర్కొన్నారు. మిగతా 40 లక్షల పాలను ఉత్పత్తిదారులు తమ గృహ అవసరాలకు వినియోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో భాగంగా రైతులకు ప్రతి లీటరుకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకాలుగా ఇన్సెంటివ్‌ను అందిస్తోందని ఆయన అన్నారు. తద్వారా కోట్లాది రూపాయల విలువ చేసే పాల ఉత్పత్తికి బాటలు వేసినట్లు అవుతోందని అన్నారు.

మార్కెట్ లో ఉన్న డిమాండ్ మేరకు పాల ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందని, అందుకోసం మరిన్ని బర్లు, ఆవులు పంపిణీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఐ.సి.ఎం.ఆర్. సూచన మేరకు ప్రతి వ్యక్తి రోజుకు 280 ఎం. ఎల్. పాలను తీసుకోవాలని.. ఇది తెలంగాణలో 350 ఎం. ఎల్. ఉందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న కోటి జనాభాకు సరిపడ పాల సరఫరా జరగడం లేదని అన్నారు. కరీంనగర్ డైయిరీలో 70 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారని, ప్రతి రోజు రెండున్నర లక్షల పాలను సరఫరా చేస్తున్నారని, ప్రతి ఏటా రూ. 348 కోట్ల టర్నోవర్ కలిగి ఉందని వినోద్ కుమార్ తెలిపారు.

- Advertisement -