ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పెద్దనోట్ల రద్దు సహా పలు అంశాలపై ఆయన ప్రధాని తో చర్చించారు ముఖ్యంగా వారిద్దరి మధ్య పెద్దనోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిణామాలపైనే చర్చ జరిగిందని సమాచారం.
ఈ నెల 8 తరువాత తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై పడిన ప్రభావం, రాష్ట్రంలోని సామాన్యులు, రైతులు, వ్యాపారులు నష్టపోయిన తీరుపై కేసీఆర్ వివరించారు. అన్ని రంగాల్లోని వారు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కోరారు. కేంద్రం నిర్ణయంలో రాష్ట్రాలను భాగస్వాములను చేసేందుకు వీలుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రధానికి సూచించారు. రైతులకు ఎక్కువ మొత్తంలో ఖాతాలో డిపాజిట్ చేసేవిధంగా చూడాలని సీఎం ప్రధానికి వివరించారు.
అదేవిధంగా రాష్ట్రం చెల్లించాల్సిన రుణ బకాయిలు, ఇతర పన్నులపై కొంతకాలం మారటోరియం విధించాలని కోరడంతోపాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోకుండా వడ్డీలేని రుణాన్ని ఇవ్వాలని.. గృహిణులు దాచుకున్న మొత్తాన్ని నల్లధనంగా పరిగణించవద్దని సూచించారు. ప్రైవేటు వైద్యశాలల్లోనూ పాతనోట్లు స్వీకరించేలా చర్యలు చేపట్టాలని మోడీకి సీఎం విజ్ఞప్తి చేశారు.