ఆస్తుల వివరాలను వెంటనే ఆన్‌లైన్ చేయాలి- సీఎం

286
kcr
- Advertisement -

నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదుకాని ప్రజల ఇళ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అన్నిస్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు నమోదుకాని ఆస్తుల వివరాలను 100 శాతం వెంటనే ఆన్‌లైన్ చేయాలని సీఎం సూచించారు.

ఆస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియను మున్సిపల్ అధికారులు, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయడానికి డీపీఓలు ఎంపీవోలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్ కు శ్రీకారం చుడుతున్నామని.. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

ఆస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియతోపాటు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు, ప్రతీ ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం సహా గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని, గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇళ్ల నుండి, గ్రామాల నుండి చెత్తను ఎలా తరలిస్తున్నారనే అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -