హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్..

310
gellu
- Advertisement -

హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో ధీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లుశ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టులయ్యి పలుమార్లు జైలుకెల్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన సిఎం కెసిఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

పేరు: Gellu Srinivas Yadav
తండ్రి పేరు: గెల్లు మల్లయ్య (మాజీ.MPTC, కొండపాక)
తల్లి పేరు: లక్ష్మి (మాజీ సర్పంచ్, హిమ్మత్ నగర్)
పుట్టినతేది: 21-08-1983
విద్యార్హతలు: ఎం ఏ, ఎల్ ఎల్ బి.
పరిశోధక విద్యార్థి (రాజనీతి శాస్త్రం)
సామాజిక వర్గం: బి.సి. (యాదవ్)
నివాస స్థలం: హిమ్మత్ నగర్ (గ్రామం),
వీణవంక (మండలం)
కరీంనగర్ (జిల్లా)
కార్యనిర్వాహక సంస్థ: రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ
రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం
(TRSV) టిఆరెస్ అనుబందం

గెల్లు శ్రీనివాస్ యాదవ్ తండ్రి గెల్లు మల్లయ్య స్థానిక మండల స్థాయి లో 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించారు. గెల్లు మల్లయ్య యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ కన్వీనర్ (2000-2005)గా, కొండపాక ఎంపీటీసీ (2001-2005)గా టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ లో మండల స్థాయి లో 2004 నుండి నేటి వరకు పనిచేస్తున్నారు. జిల్లా యాదవ సహకార సంస్థ డైరెక్టర్ (పశుసంవర్థక శాఖ, ఆంధ్రప్రదేశ్) గా ఎన్నుకోబడ్డారు. ప్రస్తుతం PACS డైరెక్టర్ గా మరియు రైతు బంధు సమితి కోఆర్డినేటర్ (కొండపాక)గా పనిచేస్తన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి హిమ్మత్ నగర్ గ్రామ సర్పంచ్ (టీఆర్ఎస్ పార్టీ) గా సేవలందించారు.

డిగ్రీ (బి.ఏ)చదువుతున్న కాలం నుంచే విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ లోని అంబర్ పెట్ లోని ప్రభుత్వ బిసి హాస్టల్ లో ఉంటూ అధ్యక్షుడు (2003-2006)గా ఎన్నికై బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు. A.V కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో కెసిఆర్ నేతృత్వంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి, కెసిఆర్ ప్రసంగాలకు ఆకర్షితుడై క్రియాశీలకంగా ఉదయమకాలం నుండి నేటి వరకు అదే ఉత్సాహంగా TRS పార్టీలో నిబద్ధతతో పనిచేశారు.

2003-2006 TRSV అధ్యక్షులు, A. V. కాలేజీ, హైదరాబాద్, గా ఉన్నప్పుడు విద్యార్థుల ఫీజు పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని నడిపి అరెస్ట్ అయ్యారు.చివరకు కాలేజ్ యాజమాన్యం ద్వారా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ సాధించడంలో విజయం సాధించారు. బిసి విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కోసం ఇందిరా పార్కు లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. 2006-2007 లో హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీ, TRSV అధ్యక్షుడు గా, TRSV రాష్ట్ర అధ్యక్షుడు బొంతు రామ్మోహన్ నాయకత్వం లో నియమితులై పనిచేశారు.సెప్టెంబర్ 19, 2006 న సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో లగడపాటి రాజగోపాల్ కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు జరిపిన నిరసన ర్యాలీలో అరెస్ట్ అయ్యారు.

టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి (2008)గా ఎర్రోళ్ళ శ్రీనివాస్ నాయకత్వం లో పనిచేశారు. 2009 సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ నాయకత్వం లో క్రియాశీలకంగా పనిచేశారు. 2009 లో కేసీఆర్ గారి అరెస్ట్ ను నిరసిస్తూ, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. 2010 లో ఉస్మానియా యూనివర్సిటీ TRSV అధ్యక్షుడు గా బాల్క సుమన్ ద్వారా నియమించబడ్డారు. జనవరి 18, 2010 న “తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్ర” ప్రారంభించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి 650 కి.మీ. పాదయాత్ర చేసి వేల మంది విద్యార్థులను యువకులను పాదయాత్రలో,తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో విజయం సాధించారు.

2010 హుజురాబాద్ ఉప ఎన్నిక లో స్టూడెంట్ ఇంచార్జి గా బస్సు యాత్ర (ప్రజా చైతన్య యాత్ర)లో పనిచేశారు. 2011, మార్చి 1న, మౌలాలి రైల్వే స్టేషన్లలో 48 గంటల రైల్ రోకో ప్రోగ్రాం ను వందలాది విద్యార్థులతో కలిసి KTR నాయకత్వం లో విజయవంతం చేశారు. 2011, మార్చి 10న, TRSV ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు గా తెలంగాణ జెఏసి పిలుపు మేరకు చారిత్రక “మిలియన్ మార్చ్ ప్రోగ్రాం”లో భారీ ర్యాలీ నిర్వహించారు. 2011,జులై 21 న యాదిరెడ్డి ఆత్మహత్యకు నిరసనగా బందుకు పిలుపునిచ్చి ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలంగాణ భవన్ కు భారీ ర్యాలీ నిర్వహించారు. సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైల్లో బంధించారు.

2001 నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్నారు. 100కు పైగా కేసులు నమోదయ్యాయి అనేక సార్లు పోలీసులు అరెస్టు చేశారు. మరియు 2 సార్లు జైలుకు వెళ్లి 36 రోజులు చర్లపల్లి సెంట్రల్ జైల్ మరియు చంచల్ గూడ సెంట్రల్ జైల్లో జైలు జీవితం గడిపారు. 2017 నుండి TRS విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పనిచేస్తున్నారు.

- Advertisement -