ఏపీ నిర్ణయం చట్ట విరుద్దం: సీఎం కేసీఆర్

326
cm kcr
- Advertisement -

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎపి ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదాలుగా సిఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని స్పష్టం చేశారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు ఈటల రాజెందర్, మహమూద్ అలీ, శ్రీనివాస గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, నీటి పారుదల సలహాదారు ఎస్.కె.జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇఎన్సి మురళీధర్, ఎజి బి.ఎస్. ప్రసాద్, అడిషనల్ ఎజి రాంచందర్ రావు, లీగల్ కన్సల్టెంట్ రవీందర్ రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాం ప్రసాద్ రెడ్డి, చంద్రమౌళి, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్డి శ్రీధర్ దేశ్ పాండే, నీటి పారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్ట తలచిన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం కాబట్టి, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.

‘‘తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు. ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాలని నిర్ణయించి, జీవో జారీ చేసింది. ఇది తీవ్ర అభ్యంతకరం. కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని వెంటనే కె.ఆర్.ఎం.బి.లో ఫిర్యాదు చేస్తాం’’ అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

‘‘గతంలో ఉన్న వివాదాలను, విబేధాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఎపికి స్నేహహస్తం అందించింది. బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించాను. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్పూర్తికి ఇది విఘాతం కలిగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదు. ఎపి తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తాం’’ అని సిఎం కేసీఆర్ ప్రకటించారు.

కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో చాలా జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గోదావరి నది నికర జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 950 టిఎంసిల నీటిని వాడుకోవడానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. తెలంగాణకు ఇంకా నీటి అవసరం ఉంది. మంచినీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు, విద్యుత్ ప్లాంట్లకు నీరు కావాలి. కాబట్టి గోదావరి మిగులు జలాల్లో తెలంగాణకు 600 టిఎంసిలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సిఎం అధికారులను ఆదేశించారు. రోజుకు రెండు టిఎంసిల నీటిని లిఫ్టు చేయడానికి ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -