మధ్యవర్తిత్వంతో సమస్యలకు పరిష్కారం!

3
- Advertisement -

భారత న్యాయవ్యవస్థ మధ్యవర్తిత్వాన్ని కేవలం ఒక ప్రత్యామ్నాయంగానే కాకుండా వివాదాలను పరిష్కరించే ఒక బలమైన వ్యవస్థగా ప్రోత్సహిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ పేర్కొన్నారు. లండన్‌లోని భారత హైకమిషన్ నిర్వహించిన ఒక ప్యానెల్ చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మధ్యవర్తిత్వం అనేది తన హృదయానికి ఎంతో నచ్చిన అంశమని పేర్కొంటూ సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ ఇప్పటికే శిక్షణ పొందిన మధ్యవర్తిత్వ నిపుణులతో ఒక బృందాన్ని సిద్ధం చేసిందని సీజేఐ తెలిపారు. ఈ రోజు ప్రతి పట్టణంలో, ప్రతి వీధిలో ప్రజలకు మధ్యవర్తిత్వం అంటే ఏమిటో తెలుసని నేను గర్వంగా చెప్పగలను అని సీజేఐ అన్నారు.

ఈ ప్యానెల్‌లో సీజేఐ సూర్య కాంత్‌తో పాటు బ్రిటన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లార్డ్ హాంబ్లెన్ ఆఫ్ కెర్సీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ ప్రెసిడెంట్ కిర్స్టీ బ్రిమెలో కేసీ, మరియు లా సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వైస్ ప్రెసిడెంట్ బ్రెట్ డిక్సన్ పాల్గొన్నారు. భారత హైకమిషనర్ కుమారన్ పి. ప్రారంభ ఉపన్యాసం చేయగా, సుప్రీంకోర్టు అడ్వకేట్-ఆన్-రికార్డ్ తన్వి దూబే ఈ చర్చకు మోడరేటర్‌గా వ్యవహరించారు.

మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడంలో న్యాయవ్యవస్థ పాత్ర గురించి సీజేఐ మాట్లాడుతూ.. భారతదేశంలో మధ్యవర్తిత్వ పరిణామాన్ని ‘మధ్యవర్తిత్వ చట్టం, 2023’ (Mediation Act, 2023) రావడానికి ముందు మరియు వచ్చిన తర్వాత అని రెండు విభాగాలుగా వివరించారు. ఈ చట్టం అమల్లోకి రావడానికి ముందే కోర్టులు మధ్యవర్తిత్వాన్ని ఒక బలమైన వివాద పరిష్కార మార్గంగా చురుగ్గా ప్రోత్సహించాయని ఆయన చెప్పారు. 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా తన ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటూ.. ట్రయల్ కోర్టు, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు స్థాయిలలో మధ్యవర్తిత్వ కేంద్రాలను స్థాపించడాన్ని ఆయన ప్రస్తావించారు.

Also Read:సుప్రీంకు మీనాక్షి నటరాజన్

దశాబ్దాలుగా చట్టపరంగా మరియు న్యాయవ్యవస్థ ద్వారా రూపుదిద్దుకున్న ఒక వ్యవస్థకు ‘మధ్యవర్తిత్వ చట్టం, 2023’ ఒక పరాకాష్ట అని ఆయన అన్నారు.స్టేట్ జుడీషియల్ అకాడమీల ద్వారా మధ్యవర్తులకు తప్పనిసరి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం,నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ , లోక్ అదాలత్‌ల ద్వారా పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకునే విధానాన్ని పౌరులకు చేరువ చేయడంలో న్యాయవ్యవస్థ తీసుకున్న చొరవలను సీజేఐ హైలైట్ చేశారు.

మధ్యవర్తిత్వం అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నది… వేగవంతమైనది మరియు వ్యాపార సంబంధాలను దెబ్బతీయకుండా కాపాడేది కాబట్టి.. పార్టీలు మొదట మధ్యవర్తిత్వం ద్వారానే తమ విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని ఆయన నొక్కి చెప్పారు.

- Advertisement -