రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన

35
- Advertisement -

సాధారణ ఎన్నికల నిర్వహణ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధమవుతున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం పనితీరును మరోసారి సమీక్షించి తగు విధంగా సర్వసన్నద్ధం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ అధికారుల బృందం ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయాన్ని సందర్శించి తాజా స్థితిగతులను పర్యవేక్షించింది. ఈ బృందంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ శ్రీ ధర్మేంద్ర శర్మ, మరో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్ శ్రీ నితేష్ కుమార్ వ్యాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఉన్నారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ వికాస్ రాజ్, అదనపు సిఇఓ లోకేష్ కుమార్,, జాయింట్ సిఇఓ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సిఇఓ శ్రీమతి సత్యవాణి తొలుత ప్రజెంటేషన్ల ద్వారా ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను వారికి వివరించారు. కేంద్ర ఎన్నికల బృందంతో జరిగిన ఇతర సమీక్షా సమావేశాలకు డిజిపి శ్రీ అంజనీ కుమార్ ఐపిఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎక్సైజ్, వాణిజ్య పన్నులు) శ్రీ సునీల్ శర్మ ఐఏఎస్, రవాణా ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీమతి వాణీ ప్రసాద్ ఐఏఎస్, అదనపు డిజిపి, ఎన్నికల వ్యయ పరిశీలన నోడల్ అధికారి శ్రీ మహేష్ భగవత్ ఐపిఎస్, అదనపు డిజిపి, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి శ్రీ సంజయ్ కుమార్ జైన్, ఐపిఎస్, రాచకొండ పోలీస్ కమీషనర్ శ్రీ డి.ఎస్.చౌహాన్, ఐపిఎస్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్, , శ్రీమతి చారు సిన్హా, సిఏపిఎఫ్, వాణిజ్య పన్నుల కమీషనర్ శ్రీ క్రిస్టినా చోంగ్తు ఐఏఎస్, కమీషనర్(ఎక్సైజ్) శ్రీ బుద్ధ ప్రకాష్ ఐఏఎస్, తదితరులు హాజరయ్యారు. శ్రీ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని బృందం- ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ (ఆదాయపు పన్ను), అదనపు డిజి(ఐటి), చీఫ్ కమిషనర్, డిజిపి (సిజిఎస్ టి), రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారులతో కూడా సమావేశమై తాజా స్థితిగతులను అడిగి తెలుసుకున్నది.

పట్టుబడుతున్న పలు ఎన్నికల తాయిలాలు, బహుమతుల వంటి వాటి ధరను లెక్కగట్టి, నామినేషన్ల ఖరారు తరువాత ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని కేంద్ర బృందం రాష్ట్ర సిఇఓను ఆదేశించింది. పట్టుబడుతున్న నగదు విషయంలో తగిన సాక్ష్యాధారాలుంటే ఉదాసీనంగా వ్యవహరించాలని కూడా స్పష్టం చేసింది. అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల తరలింపును అడ్డుకోవడానికి సాంప్రదాయ పద్దతులు కాకుండా ఆధునికంగా ఆలోచించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సూచించింది. ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి, 1950, సువిధ, సి-విజిల్, ఇఎమ్‌ఎమ్‌సి పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్‌రూమ్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేసింది.

ఓటర్ల జాబితా తుది సవరణల తరువాత పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఓటరు కార్డుల పంపిణీ, ఓటర్ల సమాచార స్లిప్‌ల విషయంలో తాజా పరిస్థితిని, వివరాలను అడిగి తెలుసుకోవడంతోపాటూ, ఎంసిఎంసి సర్టిఫికేట్‌లను రోజువారీగా జారీ చేస్తుండాలని ఆదేశించింది. కీలక పోలింగ్ కేంద్రాల్లో నిఘా కెమెరాల ఏర్పాటు పరిస్థితిని ధర్మేంద్ర శర్మ అడిగి తెలుసుకున్నారు. వార్తల కవరేజీకి సంబంధించి చేసిన ఏర్పాట్లను అభినందిస్తూ, ఇంటివద్ద నుంచే ఓటు వేయాలనుకునే సీనియర్‌ సిటిజన్‌లు, దివ్యాంగుల ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం నిర్దేశిత ఫారాలను ముందుగానే అందజేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వారి కోసంచేసిన ఏర్పాట్లను వివరంగా అడిగి తెలుసుకున్నారు.

Also Read:Harishrao:మెదక్‌లో గులాబీ జెండా ఎగరాలి

- Advertisement -