ఐర్లాండ్ సిరీస్తో ప్రారంభమైన భారత టీ20 పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ ఇప్పటివరకు ఆడిన ఐదు టీ20ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీనిని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది.
ఐర్లాండ్తో జరిగిన సిరీస్ను భారత్ 0-2తో కోల్పోగా, ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో ఇప్పటికే 0-3తో వెనుకబడి ఉంది. శుక్రవారం మరో మ్యాచ్ మిగిలి ఉంది. అయితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుకు తక్షణ ముప్పు ఏమీ లేదని తెలుస్తోంది. ఎందుకంటే బీసీసీఐతో అతనికి 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఒప్పందం ఉంది. “ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న భారత టీ20 జట్టు ప్రదర్శనను బీసీసీఐ ప్రస్తుతం నిశితంగా గమనిస్తోంది అని ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశం సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి సైకియా తెలిపారు.
జట్టు ప్రదర్శనపై సమగ్ర అంచనా ఉంటుందని, అయితే బోర్డు ఎలాంటి ఆదరాబాదరా నిర్ణయాలు తీసుకోబోదని బీసీసీఐ కార్యదర్శి చెప్పారు. సైకియా ఈ ఓటమిని కేవలం రెండు ముక్కల్లో వర్ణించారు – అదే ‘బ్యాడ్ ఫేజ్’ . అయితే, అంతర్జాతీయ క్రికెట్లో ఇది అసాధారణమైన విషయమేమీ కాదు, ఇలాంటివి జరుగుతుంటాయి. మేము దీనిని కేవలం ఒక చెడు కాలంగా (bad phase) భావిస్తున్నాము. జూలై 19న వన్డే సిరీస్ ముగిసి, జట్టు తిరిగి వచ్చిన తర్వాత, ఇంగ్లాండ్లో ఏం తప్పు జరిగిందో చర్చించడానికి జట్టులోని కీలక సభ్యులతో మేము సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తాము. వన్డే సిరీస్ కూడా ఉన్నందున, జట్టు తిరిగి ఫామ్లోకి వస్తుందని మేము ఆశిస్తున్నాము అని సైకియా చెప్పుకొచ్చారు.
ఈ సమీక్షా సమావేశం “కేవలం జట్టు ప్రదర్శన మరియు లోపాలను ఎలా సరిదిద్దాలనే దానిపైనే ఉంటుంది. మరే ఇతర విషయాలూ చర్చకు రావు” అని సైకియా నొక్కి చెప్పారు.
ప్రధాన కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత జట్టు ఎన్నో “వద్దనుకున్న రికార్డులను” ఖాతాలో వేసుకుంది. ఇందులో స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 0-3తో వైట్వాష్ అవ్వడం, వన్డే సిరీస్ ఓడిపోవడం మరియు ఐర్లాండ్తో చరిత్రలోనే తొలిసారి టీ20 సిరీస్ ఓడిపోవడం ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్పై టీ20ల్లో 0-4తో క్లీన్స్వీప్ అయ్యే పరిస్థితి రావడం ఒక పీడకల కంటే ఘోరమైనది.
ఈ సమీక్షా సమావేశానికి గంభీర్తో పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ కూడా హాజరవుతారని తెలుస్తోంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మూడు మ్యాచ్ల సిరీస్ కోసం జింబాబ్వేకు వెళ్లాల్సి ఉన్నందున, అతను అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు.
Also Read:కామిశెట్టి దర్శకత్వంలో రోషన్!
ఇంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా పర్యటన మరియు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్ల పరాజయాల తర్వాత కూడా ఇటువంటి సమీక్షలు జరిగాయి. గంభీర్ పర్యవేక్షణలో భారత్ తన టీ20 ప్రపంచకప్ టైటిల్ను కాపాడుకుని కేవలం నాలుగు నెలలే అయింది, కాబట్టి రెండు ఐసీసీ ట్రోఫీలను గెలిచిన కోచ్ను అంత తొందరగా పక్కన పెడతారని అనుకోవడానికి ఎటువంటి కారణం లేదు.కానీ మరో కోణం కూడా నిజమే. అహ్మదాబాద్లో టైటిల్ గెలిచిన ఆ రాత్రి నుండి సబర్మతి మరియు థేమ్స్ నదులలో చాలా నీరు ప్రవహించింది. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని ప్రస్తుత జట్టు అసలు జట్టుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.

