న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకోవడం ద్వారా బంగ్లాదేశ్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మెరుగుపడటమే కాకుండా, 2027 ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఛటోగ్రామ్లో గురువారం జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో గెలిచిన బంగ్లాదేశ్, తన ఖాతాలో మరో 4 రేటింగ్ పాయింట్లను చేర్చుకుంది.
ప్రస్తుతం 83 పాయింట్లతో బంగ్లాదేశ్ 9వ స్థానంలో ఉండగా, 8వ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ (88 పాయింట్లు)కు చేరువయ్యింది. అదే సమయంలో 10వ స్థానంలో ఉన్న వెస్టిండీస్ (77 పాయింట్లు) కంటే 6 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా దేశాల్లో జరగనుంది.
ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మార్చి 2027 నాటికి ర్యాంకింగ్స్లో మొదటి 8 స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా మెగా ఈవెంట్కు అర్హత సాధిస్తాయి. దక్షిణాఫ్రికా ఇప్పటికే టాప్ 5లో ఉన్నందున, ర్యాంకింగ్స్లో 9వ స్థానంలో ఉన్న జట్టుకు కూడా నేరుగా అర్హత లభించే అవకాశం ఉంది.వెస్టిండీస్, ఇంగ్లాండ్లకు సవాల్గత 2023 ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్, ఈసారి నేరుగా అర్హత సాధించాలని పట్టుదలతో ఉంది. అయితే బంగ్లాదేశ్ వరుస విజయాలు విండీస్ ఆశలకు గండి కొడుతున్నాయి.
మరోవైపు ఇంగ్లాండ్ కూడా తన ర్యాంకింగ్ను కాపాడుకోవాల్సిన ఒత్తిడిలో పడింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం 7వ స్థానంలో నిలకడగా ఉండటంతో.. మిగిలిన రెండు స్థానాల కోసం ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మరియు వెస్టిండీస్ మధ్య రాబోయే 11 నెలల పాటు తీవ్ర పోటీ నెలకొననుంది.
ALso Read:ప్రతిష్టాత్మకంగా భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్!

