నందమూరి అభిమానులకు బాలకృష్ణ బహిరంగ లేఖ..

76
Balakrishna
- Advertisement -

అభిమానులకు నందమూరి బాలకృష్ణ బహిరంగ లేఖ రాశారు. విశ్వవిఖ్యాత ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శత జయంతి ఉత్సవాలను ఎన్టీఆర్‌ జన్మస్థలం నిమ్మకూరులో ఘనంగా జరుపనున్నారు. ఈ వేడుకలను మే 28న నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారు. మే 28 నుంచి వచ్చే ఏడాది అంటే 2023 మే 28 వరకు వేడుకలను ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ‘శత పురుషుని శత జయంతి ఉత్సవాలు’ పేరిట ఓ లేఖను విడుదల చేశారు.

“అభిమానులకు, తెలుగు నేలకు, విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న తెలుగుజాతికి…. నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి..

మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయ సినిమా తెలుగు సినిమాని తలఎత్తి చూసింది. తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు సంస్కృతి తలఎత్తి నిలబడింది. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది. ఆ రోజు నుంచి 2023 మే 28 వరకు… 365 రోజుల పాటు శత పురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచెరగులా జరగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది. ఆనందంతో పాలుపంచుకుంటుంది.

మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారు. అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్లి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను. వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాను. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను నా చేతుల మీదుగా ప్రారంభిస్తాను. 365 రోజులు… వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు, నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు… ఈ మహత్కార్యాన్ని పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్‌లో ప్రారంభించి, ఒంగోలు వెళ్లి మహానాడులో పాల్గొంటానని తెలుగు జాతికి తెలియజేస్తున్నాను.

అహర్నిశలు మీ అభిమానం కోసం
మీ నందమూరి బాలకృష్ణ

- Advertisement -