పెండింగులో ఉన్న జాతీయ రహదారులను మంజూరు చేయలి..

190
b vinod kumar
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారుల విషయంలో జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రానికి 25 జాతీయ రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వగా, అందులో 13 జాతీయ రహదారులను మాత్రమే మంజూరు చేశారని, మిగతా12 జాతీయ రహదారులను కూడా వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి లేఖ రాశారు.

జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడు (2014-19) టీఆర్ఎస్ ఎంపీలం అనేక సార్లు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రానికి 25 జాతీయ రహదారుల ను మంజూరు చేయాలని కోరగా అందులో 13 రహదారులకు మంజూరులు ఇచ్చారని, మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పనులేవీ ప్రారంభం కాలేదని వినోద్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. మంజూరైన జాతీయ రహదారులకు నంబర్లు కూడా ఇచ్చారని, కానీ పనులు ప్రారంభించడం విషయం కేంద్ర ప్రభుత్వం మరిచి పోయిందని వినోద్ కుమార్ అన్నారు.

ఈ జాతీయ రహదారుల పనులను తక్షణమే ప్రారంభించాలని వినోద్ కుమార్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి రాసిన లేఖలో కోరారు. పెండింగ్ లో ఉన్న మిగతా 12 జాతీయ రహదారులను వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన జాతీయ రహదారుల పనులు ఇటీవలే పూర్తి కావడంతో ఆ జాతీయ రహదారులను ఈనెల 21 న కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభించనుండటం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే మంజూరైన జాతీయ రహదారుల పనులను ప్రారంభించడానికి, పెండింగులో ఉన్న మిగతా 12 జాతీయ రహదారుల మంజూరు విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ. కిషన్ రెడ్డి చొరవ చూపాలని వినోద్ కుమార్ సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం అవసరమైన భూములను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వినోద్ కుమార్ తెలిపారు.

- Advertisement -