ఈ సంవత్సరం ఆసియా కప్ను సెప్టెంబర్లో భారతదేశం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్-పాక్ మధ్య తలెత్తిన సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహణపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.
రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ నాయకత్వంలోని భారత-పాకిస్తాన్ జట్లు గత ఆసియా కప్లో రెండుసార్లు తలపడ్డాయి. కానీ తాజా పరిణామాల దృష్ట్యా ఈ ఏడాది ఆసియా కప్ రద్దయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.భారత్, పాకిస్తాన్ జట్లు గత దశాబ్ద కాలంగా ద్వైపాక్షిక క్రికెట్ ఆడకపోగా, ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో బీసీసీఐ పాకిస్తాన్తో సంబంధాలను పూర్తిగా కట్ చేసే ఆలోచన చేస్తోంది బీసీసీఐ.
ఆసియా కప్ భారత్లో నిర్వహించే అవకాశాలు తగ్గుతున్న తరుణంలో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆఫ్గానిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్లతో కలిసి ట్రై సిరీస్ నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఆసియా కప్ను భారత్ నుంచి యుఎఇకి తరలించినా, లేక మొత్తం రద్దైనా, ఆగస్టులో ఆఫ్గానిస్తాన్ పర్యటనను రద్దు చేసి UAE, ఆఫ్గాన్ జట్లతో త్రిభుజ సిరీస్ను దుబాయ్లో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం అని పీసీబీ వర్గాలు తెలిపాయి.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గత నెలలో ఆసియా కప్ నుంచి భారత్ తప్పుకుంటుందన్న వార్తలను ఖండించారు. అప్పట్లో బోర్డు దృష్టి ఐపీఎల్ మిగిలిన మ్యాచ్లు, ఆపై ఇంగ్లాండ్ టెస్టు సిరీస్పై ఉందని, ఆసియా కప్ అంశం త్వరలోనే చర్చకు వస్తుందని తెలిపారు. మరి ఆసియా కప్పై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:ఆలస్యం..ఆమె ప్రాణాలను కాపాడింది!

