అక్టోబరు15 నుంచి 31వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ@సుర్యాపేట

71
- Advertisement -

సుర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ గ్రౌండ్ లో అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు రాష్ట్ర స్ధాయి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్మీ కల్నల్ కీట్స్ కె దాస్ జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ తో సమావేశమై ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం పోలీసు ,రెవెన్యూ, మున్సిపల్, మెడికల్, ఎలక్ట్రిసిటీ, ఆర్టీవో , ఫైర్ సేఫ్టీ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశమున్నందున జిల్లాలో శాంతి భద్రతలను పకడ్బందీగా నిర్వహించాలని ,రిక్రూట్ మెంట్ జరిగే ప్రాంతంలో ప్రజలు గుమిగూడకుండా చూడాలని సూచించారు. ఈసందర్భంగా పలు ప్రైవేట్‌  డిఫెన్స్ అకాడమీల ప్రకటనలు లేకుండా చూడాలని తెలిపారు.

గ్రౌండ్ తయారీ, గ్రౌండ్ లో బారికేడ్లు, లైటింగ్, మైక్ లు, మంచినీటి సరఫరా, అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన అభ్యర్థులకు అత్యవసర పరిస్థితిలో మెరుగైన వైద్య చికిత్స అందించడానికి వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

రిక్రూట్ మెంట్ ర్యాలీకి హాజరయ్యే ఆర్మీ అధికారులకు సమీప రైల్వే స్టేషన్‌ నుంచి రవాణా ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. వర్షం వస్తే తట్టుకునే విధంగా వాటర్ ప్రూఫ్ టెంట్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు.

- Advertisement -