వైసీపీ ది మతతత్వ ప్రభుత్వం- సోమువీర్రాజు

78
- Advertisement -

బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పాల్గొని మాట్లాడారు. ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఆత్మకూరు సంఘటనలో ప్రభుత్వం ముద్దాయి అని మండిపడ్డారు. ఆత్మకూరు ఘటనలో పోలీసులపై కూడా దాడి జరిగింది వాస్తవం కాదా..జిల్లా బీజేపీ అధ్యక్షుని వాహనం దగ్దం చేసి, అతనిని చంపేస్తామని హెచ్చరించారు. ఒరేయ్ శ్రీకాంత్ రెడ్డి నిన్న చంపేస్తాం అంటూ బెదిరించిన ఆడియో రికార్డింగ్‌ కూడా ఉంది. డీఎస్పీ కబురు పెడితేనే.. శ్రీకాంత్ రెడ్డి కారులో అక్కడకు వెళ్లాడు. అదే కారులో ప్రెస్ రిపోర్టర్లు కూడా ఉన్నారు. జిల్లా ఎస్పీ, డీజీపీలు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. పక్కా ఆధారాలు ఉన్నా.. శ్రీకాంత్ రెడ్డి పై ఎఫ్.ఐ.ఆర్ ఎలా నమోదు చేశారు అని సోమువీర్రాజు ప్రశ్నించారు.

తప్పుడు ఫిర్యాదులు ఇస్తే.. విచారించకుండా జైళ్లకు పంపిస్తారా.. వైసీపీకి151స్థానాలు ఇచ్చింది.. అరాచక పాలన చేయమనా..ఎపీలో మతతత్వ ప్రభుత్వం సాగుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా పోలీసులపైనే కేసు పెట్టాలని డిమాండ్ చేస్తారా అంజాద్ భాష, మరికొంతమంది కలిసి అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టారు. శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నేతలపై పెట్టిన కేసులు ఉప సంహరించుకోవాలి అని డిమాండ్‌ చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా మసీదు ఎలా కడతారు. ఒక మతానికి కొమ్ము కాసేలా ఉన్న వైసీపీ వైఖరిని వ్యతిరేకిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే అండతో 40 గంటల్లో మసీదు నిర్మాణం చేశారు. ఈ ఘర్షణకు కారణమైన ముస్లీంలు, ఎమ్మెల్యే పైనా కేసులు పెట్టాలి. ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇస్తే.. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే… తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపిస్తున్నారు. ఇప్పుడు అయినా వైసీపీ తీరు మార్చుకోకపోతే.. తాడోపేడే తేల్చుకుంటాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమా టిక్కెట్ల వివాదంలో ప్రభుత్వం తీరుపై ఫైర్ అయిన సోము వీర్రాజు.. సినిమా టిక్కెట్ల అంశంలో ఎపీ ప్రభుత్వం ఆలోచన ఏమిటి అని ప్రశ్నించారు.ఇసుక ధరలు ఎందుకు తగ్గించరు.. ప్రజలకు అవసరం లేదా ఇది. సినిమా టిక్కెట్ ధరలు ఒక్కటి తగ్గించి గొప్పగా చెప్పుకోవడం విచిత్రంగా ఉంది. మీ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బస్తా ధరలు తగ్గించవచ్చు కదా..ధాన్యం కొనేవాళ్లులేక రైతులు గగ్గోలు పెడుతున్నా… పట్టదు. జగన్‌కు దమ్ముంటే… 1400కి ధాన్యం కొనుగోలు చేసి చూపించు.. నిత్యావసర వస్తువలు, ఇసుక, సిమెంట్ ధరలు కూడా తగ్గించు.. ఇవన్నీ ప్రజలకు అవసరం లేనివిగా భావిస్తున్నారా.. మీ చేతిలో ఉన్న వాటి ధరలు గురించి మాత్రం మాట్లాడరా అని నిలదీశారు. రెండు కోట్ల మంది ప్రజల గురించి జగన్ ఆలోచించరు..వేల మంది చూసే సినిమా టిక్కెట్లు తగ్గించి గొప్ప పని చేసినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారు.

కనీసం సిగ్గు లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు..గతంలో చంద్రబాబు, నేడు జగన్ లు ప్రజలను మోసం చేశారు.ఎపీ ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేసే ఏకైక పార్టీ బీజేపీనే అన్నారు. గనులను జాతీయం చేస్తే… ఎపీ ప్రభుత్వానికి అసలు అప్పులు చేయాల్సిన అసరమే ఉండదు. వైయస్ తండ్రి హయాం నుంచి నేటి వరకు గనులను దోచుకుని కోట్లు కూడేసుకున్నారు. ఎయిడెడ్ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు యత్నించారు. మంత్రి గారూ.. రాంగోపాల్ వర్మను పిలిచి బోజనం పెట్టారు. విద్యార్దుల కడుపు నింపే విషయాన్ని మాత్రం పట్టించుకోరు అని ఎద్దేవ చేశారు. బీజేపీని ఓడించినా.. రాష్ట్రం మొత్తం 24 గంటలూ కరెంటును ఇచ్చాం. పౌరసరఫరాలశాఖలో బియ్యం రవాణా అతి పెద్ద కుంభకోణం. గత ప్రభుత్వంలో ఓ మంత్రి ఈ డబ్బుతో ఒక ఇల్లే నిర్మించాడు. అధికారులు కుర్చీలకు అతుక్కుపోయి దోచుకుంటున్నారు. వైసీపీ నేతలే బియ్యం అక్రమ రావాణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇటువంటి అక్రమాలను త్వరలోనే బీజేపీ బయట పెడుతుంది. పరిపాలన అంటే ప్రజల సౌభాగ్యాన్ని కోరే విధంగా సాగాలి అన్నారు. ఈ పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర వెంకట శివన్నారాయణ, బిజెపి నేత లక్ష్మీ పతిరాజా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -