మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జరిగిన బహిరంగ సభలో ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా.గత నాలుగేళ్లుగా ఏకనాథ్ షిండే వర్గం దేనికోసమైతే ప్రయత్నిస్తోందో ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఇంతకుముందు ప్రజలు ఏకనాథ్ షిండే గారి పేరు పక్కన ‘శివసేన-షిండే వర్గం’ అని చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎలాంటి వర్గాలు మిగలలేదు… కేవలం ఒక్కటే శివసేన ఉంది అని వ్యాఖ్యానించారు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) కి చెందిన తొమ్మిది మంది లోక్సభ ఎంపీలలో ఆరుగురు ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ సమావేశానికి హాజరుకాకుండా తమకు ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు ఇవ్వాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. షిండే నేతృత్వంలోని శివసేనలో వీరు చేరడం త్వరలోనే అధికారికం కానుంది.దీని ద్వారా కేంద్రంలోని పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ-ఎన్డీఏ (NDA) ప్రభుత్వానికి మరింత మద్దతు లభించనుంది.
2022లో షిండే విడిపోయినప్పటి నుండి ఉద్ధవ్ ఠాక్రే యొక్క సంస్థాగత బలాన్ని దెబ్బతీసే చర్యలకు వెనుక నుండి మద్దతు ఇస్తున్న అమిత్ షాకు, కొల్హాపూర్ ప్రకటన ఒక వ్యూహాత్మక విజయం లాంటిది.
Also Read:రామాలయం విరాళాల వివాదంపై సిట్
ఉద్ధవ్ దివంగత తండ్రి బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పేరు మరియు చిహ్నాన్ని దక్కించుకున్న షిండే పార్టీయే బాల్ ఠాక్రే వారసత్వానికి అసలైన వారసురాలని షా పేర్కొన్నారు. 2023లో కేంద్ర ఎన్నికల సంఘం ‘శివసేన’ పేరును మరియు గుర్తు విల్లు-బాణంను షిండే వర్గానికి కేటాయించగా ఉద్ధవ్ నేతృత్వంలోని ‘శివసేన (UBT)’కి మండుతున్న జ్వాల గుర్తును కేటాయించారు.

