ఐపీఎల్ 2026లో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపై ఇప్పటికే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. శుక్రవారం బెల్ఫాస్ట్లో ఐర్లాండ్తో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్ల సిరీస్లో అతనికి భారత్ తరఫున ఆడే అవకాశం (డెబ్యూ) దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
ఈ 15 ఏళ్ల కుర్రాడి కోసం ప్రత్యేకంగా చేంజింగ్ రూమ్ ఏర్పాటు చేసేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ…అతడిని నేరుగా తుది జట్టులోకి (XI) ఎలా తీసుకోవాలనే సవాలును భారత్ ఎదుర్కొంటోంది. ఇది అంత సులభం కాదు ఎందుకంటే అద్భుతమైన ఫామ్లో ఉన్న సంజూ శాంసన్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ జోడీని మార్చాల్సి ఉంటుంది.
శాంసన్ టీ20 ప్రపంచకప్ను బెంచ్పైనే ప్రారంభించినప్పటికీ టోర్నీ ముగిసే సమయానికి మూడు అద్భుతమైన ఇన్నింగ్స్లతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును గెలుచుకున్నాడు. మరోవైపు అభిషేక్ శర్మకు ప్రపంచకప్ ఆరంభం అంతగా కలిసిరాలేదు కానీ చివరిలో 21 బంతుల్లో 52 పరుగులు చేసి ఫామ్లోకి వచ్చాడు. 2024లో అరంగేట్రం చేసినప్పటి నుండి ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాలలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాటర్గా అతను ఉన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్లోనూ అద్భుతంగా రాణించారు.
ఒకవేళ సూర్యవంశీని జట్టులోకి తీసుకుంటే… శాంసన్, అభిషేక్ మరియు ఇషాన్ కిషన్లలో ఇద్దరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కుతుంది. నాల్గవ స్థానంలో అయ్యర్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉన్నందున…శాంసన్ లేదా అభిషేక్ తమ స్థానాన్ని మార్చుకోవాలి లేదా జట్టుకు దూరం కావాల్సి ఉంటుంది.
Also Read:సర్దార్ 2 వర్సెస్ రణబలి!
టీ20 ప్రపంచకప్ను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న తర్వాత జట్టులో ఇటువంటి మార్పులు చేయడం కఠినంగా అనిపించవచ్చు, కానీ జట్టులో స్థానం కోసం పోటీ అంత తీవ్రంగా ఉంది. అభిషేక్, శాంసన్ ఇద్దరిపైనా త్వరగా రాణించాలనే ఒత్తిడి ఉంటుంది. కెప్టెన్సీ మరియు జట్టు నుండి సూర్యకుమార్ యాదవ్ను తప్పించడం ద్వారా… కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సెలెక్టర్లు వెనుకాడరనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. మొత్తంగా సూర్యవంశీ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడా లేదా అన్నదానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

