ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి మద్దతు గణనీయంగా పెరుగుతున్నది. ముఖ్యంగా జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఇఫ్టు తదితర సంఘాలతోపాటు వివిధ ఇతర సంఘాల నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీబీజీకేఎస్లో చేరుతున్నారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో గులాబీ సంఘంలో పెద్దసంఖ్యలో టీఎన్టీయూసీ, సింగరేణి హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల నుంచి టీఆర్ఎస్లో చేరారు.
ఈ సంధర్బంగా కవిత మాట్లడారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తారని అన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో తాను ఇచ్చిన హామీని అమలు చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు వారసత్వ ఉద్యోగాలపై కేసులు వేయించారన్నారు. ప్రభుత్వానికి కార్మికులకు వారిధిగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని కార్మికులు గెలిపించాలని ఆమె కోరారు. సింగరేణిలో పనిచేసే కార్మికులను భారత సైనికుడిగా కేసీఆర్ భావిస్తారని కవిత చెప్పారు.
గతంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు ఒకరిపై ఒకరు పోటీ చేసుకుని ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణ సంఘాన్ని ఒక్కరుగా ఎదుర్కొలేమనే ఉద్దేశంతోనే సిద్ధాతాలకు భిన్నంగా కూటమిగా ఏర్పడ్డాయన్నారు. సింహం సింగిల్గానే వస్తుందని, వారెందరు కూటమిగా ఏర్పడినా టీబీజీకేఎస్దే మరోసారి గెలుపని కవిత ధీమా వ్యక్తంచేశారు.

