ముఖ్యమంత్రి విజయ్ సహనటి అయిన నటి త్రిష కృష్ణన్ను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. కావేరి అంశాన్ని పరిష్కరించడంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ వైఫల్యాన్ని విమర్శించే క్రమంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది విజయ్కి సదరు నటితో ఉన్న స్నేహాన్ని ఉద్దేశించి చేసిన లైంగిక వేధింపుల వ్యాఖ్య అని ప్రత్యర్థులు ఆరోపించడంతో రాజకీయంగా పెద్ద గందరగోళం మొదలైంది. ఆయనపై BNS లోని 61, 79, 192, 196, 296(b), 351(2), 352 సెక్షన్లతో పాటు, ‘తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం’లోని సెక్షన్ 4 మరియు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేశారు.
ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్పై జరిగిన ఈ చర్య రాజకీయ కక్షసాధింపుతో కూడుకున్నదని డిఎంకే (DMK) ఒక పత్రికా ప్రకటనలో ఆరోపించింది. కావేరి జలాల వివాదంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, దీనిపై టీవీకే (TVK) ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాధానం లేకపోవడంతోనే ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకుని, అరెస్ట్ చేయడానికి లేని వివాదాన్ని సృష్టించారని పార్టీ పేర్కొంది. ఉదయనిధి వ్యాఖ్యలు కేవలం కావేరి నదీ జలాల నిమిత్తం చేసినవేనని, వాటిని కావాలనే తప్పుగా చిత్రీకరించారని డిఎంకే స్పష్టం చేసింది. చట్టం అందరికీ ఒకటే అయితే, డిఎంకేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, ఇతర టీవీకే నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.
శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఒక రోజు ముందు ఈ అరెస్ట్ చేయడం వెనుక, ఉదయనిధి సభకు హాజరుకాకుండా అడ్డుకోవడం మరియు ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ప్రధాన లక్ష్యమని పార్టీ ఆరోపించింది. డిఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో న్యాయవాదుల బృందంతో సమావేశమై, కేసుకు సంబంధించిన అన్ని నిజాలను కోర్టు ముందు ఉంచాలని సూచించినట్లు తెలిపింది. అనంతరం ఆ లీగల్ టీమ్ను తంజావూరుకు పంపారు.
Also Read:మౌళి తనుజ్..’దొంగ నా కొడుకు’

