ప్రసూతి సెలవుల మంజూరు..హైకోర్టు సంచలనం

1
- Advertisement -

ప్రసూతి సెలవుల (Maternity leave) మంజూరులో మొదటి ప్రసవానికి, రెండో ప్రసవానికి మధ్య కనీసం రెండేళ్ల వ్యవధి ఉండాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిబంధనలు చెల్లవని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సోషల్ సెక్యూరిటీ కోడ్, 2020’ చట్టం ముందు రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులు చెల్లకుండా పోతాయని కోర్టు మరోసారి పునరుద్ఘాటించింది.

తమ రెండో ప్రసవం కోసం 180 రోజుల ప్రసూతి సెలవులకు దరఖాస్తు చేసుకోగా, గతంలో లీవు తీసుకుని రెండేళ్లు పూర్తికాలేదనే నెపంతో అప్లికేషన్లను తిరస్కరించిన ఇద్దరు ప్రభుత్వ స్టాఫ్ నర్సుల ఉత్తర్వులను జస్టిస్ సిద్ధార్థ్ నందన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ కొట్టివేసింది. కేంద్ర చట్టం ద్వారా లభించే భాధ్యతలు, హక్కులను యు.పి. ఫైనాన్షియల్ హ్యాండ్‌బుక్‌లోని రూల్ 153(1) లేదా డిసెంబర్ 8, 2008 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల (GO) ఆధారంగా తగ్గించలేరని ధర్మాసనం తీర్పునిచ్చింది.

ప్రసూతి ప్రయోజనాలను పొందడానికి రెండు ప్రసవాల మధ్య ఎలాంటి కనీస సమయ పరిమితిని ‘సోషల్ సెక్యూరిటీ కోడ్, 2020’ విధించలేదని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వులను సాకుగా చూపి ఈ ప్రయోజనాన్ని నిరాకరించలేదని స్పష్టం చేసింది. వైద్య విద్య శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇద్దరు రెగ్యులర్ నర్సింగ్ ఆఫీసర్లు 2024లో ప్రసూతి సెలవులు పొంది, మళ్లీ తమ రెండో ప్రసవం కోసం అప్లై చేయగా అధికారులు యు.పి. ఫైనాన్షియల్ హ్యాండ్‌బుక్‌ను చూపి నిరాకరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున అడ్వకేట్లు మహమ్మద్ ఇఫ్తేఖార్ ఫారూఖీ, జీషాన్ అహ్మద్ సిద్ధిఖీ వాదనలు వినిపించారు.

ప్రసూతి ఉపశమనానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను అమలు చేయడానికి పార్లమెంటు చేసిన చట్టమే ‘సోషల్ సెక్యూరిటీ కోడ్, 2020’ అని హైకోర్టు పేర్కొంది. ఈ కోడ్‌లోని సెక్షన్ 161 ప్రకారం.. ఈ చట్టంలోని నిబంధనలే ఏవైనా ఇతర వైరుధ్య చట్టాలు, కార్యనిర్వాహక ఉత్తర్వులు లేదా సర్వీసు నిబంధనల కంటే మిన్నగా అమలులో ఉంటాయని స్పష్టంగా పేర్కొనబడింది. అందువల్ల రెండేళ్ల వ్యవధిని పరిమితిగా విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విధానం నిలవదని కోర్టు వ్యాఖ్యానించింది.

ఫైనాన్షియల్ హ్యాండ్‌బుక్ నిబంధనలు ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1935’ కింద రూపొందించబడ్డాయని మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 313 ప్రకారం మాత్రమే కొనసాగుతున్నాయని జస్టిస్ నందన్ గుర్తుచేశారు. ఇవి కార్యనిర్వాహక ఉత్తర్వులు మాత్రమేనని, పార్లమెంట్ చేసిన కేంద్ర చట్టాన్ని అధిగమించే స్థాయి శాసనాలుగా వీటిని పరిగణించలేమని తెలిపారు.

ఈ తీర్పు ప్రసూతి ఉపశమనాన్ని సామాజిక న్యాయం అనే రాజ్యాంగ చట్రంలో నిలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 38, 39, 42, 43లతో పాటు ఆర్టికల్ 15(3)ను ప్రస్తావిస్తూ.. మహిళా ఉద్యోగులకు గౌరవప్రదమైన, అనుకూలమైన పని వాతావరణాన్ని కల్పించడం మరియు ప్రసూతి ఉపశమనాన్ని అందించడం ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత అని పేర్కొంది. మొదటి మరియు రెండో బిడ్డ జననాల మధ్య ఎలాంటి కనీస సమయ పరిమితిని పార్లమెంట్ తన చట్టంలో చేర్చలేదని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం సొంత ఉత్తర్వుల ద్వారా అటువంటి నిబంధనను తీసుకురాలేదని కోర్టు పేర్కొంది.

Also Read:మోదీపై అసభ్యకర పోస్టులు..పోలీసుల నోటీసులు

పిటిషన్‌ను ఆమోదించిన హైకోర్టు, సెలవుల తిరస్కరణ ఉత్తర్వులను రద్దు చేసింది. ‘సోషల్ సెక్యూరిటీ కోడ్, 2020’ కింద వారి ప్రసూతి ప్రయోజనాల దరఖాస్తులను తిరిగి పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. తీర్పు ప్రతితో పాటు కొత్తగా దరఖాస్తులు సమర్పించిన రెండు వారాల్లోగా ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -