వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) పరిధిలో భారీ భూ కుంభకోణం జరిగిందని…..కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్ ఈవీ వెంకట్రామిరెడ్డి చేతులు కలిపి వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తెగనమ్మారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.70 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆయన ధ్వజమెత్తారు.
వరంగల్లో వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు రెండో రాజధానిగా భావించే వరంగల్ నగరంలో గజం స్థలం ధర మార్కెట్లో దాదాపు రూ.1.50 లక్షల వరకు పలుకుతోందని పేర్కొన్నారు. అయితే, గత జూన్ 21న నిర్వహించిన కూడా భూముల వేలంపాటలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొందరు వ్యక్తులతో సిండికేట్గా మారారని ఆరోపించారు. మార్కెట్ ధర కంటే భారీగా తగ్గించి, కేవలం రూ.60 వేలకే గజం చొప్పున ప్రభుత్వ భూములను కట్టబెట్టారని విమర్శించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టెండర్ల విధానాన్ని నడుపుతుంటే, కూడాలో మాత్రం కావాలనే ఆఫ్లైన్ టెండర్లు నిర్వహించి అవకతవకలకు పాల్పడ్డారని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. 2.27 ఎకరాల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కూడా కార్యాలయంలోని నాలుగు గోడల మధ్యే కూర్చొని, తమకు అనుకూలమైన నలుగురు వ్యక్తులతో వేలంపాట పాడించి ముగించేశారని దుయ్యబట్టారు. ఈ అంతర్గత ఒప్పందాల ద్వారా సుమారు రూ.70 కోట్ల మేర అవినీతికి తెరలేపారని ఆయన ఆరోపించారు.
నాయిని రాజేందర్ రెడ్డి నాలుగు అడుగులు కూడా లేడు.. కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వాడిని చూసుకొని కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఇంకా ఎక్కువ రెచ్చిపోతున్నాడు. ఈ మూడేండ్ల కాలంలో మీరు వరంగల్కు చేసిన అభివృద్ధి ఏమీ లేదు.. చేసింది కేవలం అవినీతి మాత్రమే అని వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

