బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేయాలని జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం కాంగ్రెస్, ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) మధ్య విభేదాలకు దారితీసింది. కిశోర్కు ఇండియా కూటమి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు అనగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుండి తామే పోటీ చేయడానికి ఆర్జేడీ ఆసక్తి చూపుతోంది.
జాలే అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు రిషి మిశ్రా మాట్లాడుతూ… బీజేపీకి బలమైన పట్టున్న బాంకీపూర్లో ప్రతిపక్ష అభ్యర్థిగా కిశోర్కు ఇండియా కూటమి మద్దతు ఇవ్వాలని సూచించారు. దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలవాలని ఆయన కిశోర్ను కోరారు.
ఈ సీటు బీజేపీకి బలమైన కోట. కిశోర్ బరిలోకి దిగడంతో ఈ పోటీ హైప్రొఫైల్గా మారింది. ఎన్డీఏ (NDA)పై విజయం సాధించి మా బలాన్ని నిరూపించుకోవడానికి ఇండియా కూటమికి ఇదొక మంచి అవకాశం అని మిశ్రా పేర్కొన్నారు. అయితే మిశ్రా ఈ వ్యాఖ్యలను వ్యక్తిగత హోదాలో చేశారని కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరిగా కేవలం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆర్జేడీ పేర్కొంది.
గతంలో కూడా బాంకీపూర్ నుండి ఆర్జేడీ పోటీ చేసిందని, ఈ ఉపఎన్నికలోనూ తామే పోటీ చేస్తామని ఆర్జేడీ స్పష్టం చేసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఈ సీటుకు రాజీనామా చేయడంతో బాంకీపూర్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి జూలై 30న పోలింగ్ జరగనుండగా, ఆగస్టు 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read:రెండో టీ20 ఓటమిపై శ్రేయాస్
బాంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి బలమైన కోటగా ఉంది. 2010, 2015, 2020 ,2025లో నబిన్ ఇక్కడి నుండి విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నబిన్కు 98,299 (62.66 శాతం) ఓట్లు రాగా ఆయన చేతిలో ఓడిపోయిన ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారికి 46,363 (29.55 శాతం) ఓట్లు వచ్చాయి.

