బిహార్లో జరిగిన నీట్ యూజీ (NEET-UG) రీటెస్టులో మున్నాబాయ్ ఎంబీబీఎస్లు పట్టుబడ్డారు. డమ్మీ అభ్యర్థులతో పరీక్ష రాయించే ముఠా గుట్టును బిహార్ పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటన పరీక్షల భద్రత, అంతర్గత సిబ్బంది పాత్ర మరియు విద్యార్థుల ప్రమేయంపై మళ్లీ పలు ప్రశ్నలను లేవనెత్తింది.
బిహార్లోని లఖిసరాయ్లో జరిగిన నీట్-యూజీ రీటెస్టులో అసలు అభ్యర్థులకు బదులుగా పరీక్షలు రాసేందుకు (సాల్వర్స్) ఈ ముఠా మనుషులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో భాగంగా వైద్య విద్యార్థులు, బయోమెట్రిక్ కంపెనీ సిబ్బందితో సహా మొత్తం 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గయలోని ANM మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విద్యార్థి అయిన అర్పిత్ రాజ్ ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులలో ఒకడని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో 2024 నీట్ పేపర్ లీక్ కేసులో ఇతనిని సిబిఐ (CBI) విచారించింది. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH) లో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మయాంక్ కశ్యప్ అనే మరో వైద్య విద్యార్థిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. వీరితో పాటు పరీక్షా ప్రక్రియలో పాల్గొన్న బయోమెట్రిక్ కంపెనీకి చెందిన 14 మంది ఉద్యోగులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మయాంక్ కశ్యప్ బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగిగా నటిస్తూ హసన్పూర్ హైస్కూల్ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడంతో ఈ నెట్వర్క్ పోలీసుల నిఘా నీడలోకి వచ్చింది. ఈ దర్యాప్తులో మొదటగా అతడే పట్టుబడగా, ఆ తర్వాత లఖిసరాయ్లోని KRK హయ్యర్ సెకండరీ స్కూల్, కేంద్రీయ విద్యాలయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.
Also Read;కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్!
ఈ దాడుల్లో ఏడుగురు అభ్యర్థులతో పాటు ఈ స్కామ్తో సంబంధం ఉన్న మరికొంత మందిని అరెస్ట్ చేశారు. ఈ విచారణలో మెడికల్, నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థుల ప్రమేయం కూడా వెలుగులోకి వచ్చింది. నీట్ పరీక్ష సమయంలో ఆయా విద్యాసంస్థలు కఠిన నిబంధనలు విధించినప్పటికీ, వైద్య విద్యార్థులు ఈ అక్రమాలకు ఎలా పాల్పడగలిగారనే దానిపై విచారణ సంస్థలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పరీక్ష జరిగే సమయంలో క్యాంపస్లను విడిచి వెళ్లవద్దని మెడికల్ కాలేజీలు విద్యార్థులను ఆదేశించాయి.

