దేశవ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర కొరతను ఎదుర్కొంటున్న రెండు ప్రధాన కీమోథెరపీ మందులైన ‘సిస్ప్లాటిన్’, ‘కార్బోప్లాటిన్’ ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. దేశంలో క్యాన్సర్ మందుల కొరత నిజంగానే ఉందని మరియు దీనిపై అత్యవసర చర్యలు అవసరమని ఉన్నత స్థాయిలో ప్రభుత్వం అధికారికంగా అంగీకరించినట్లయింది.
ధరల నియంత్రణ చట్టం (DPCO) 2013 లోని ‘పారా 19’ (Para 19) నిబంధనను ఉపయోగించి ఈ మందుల ధరలను పెంచడానికి కేంద్రమంత్రి ఆమోదం తెలిపారని ఫార్మాస్యూటికల్స్ విభాగం జూన్ 7న నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) కి రాసిన లేఖలో పేర్కొంది. సాధారణంగా మార్కెట్లో అత్యవసర మందుల లభ్యతను పెంచడానికి లేదా అవి అందరికీ అందుబాటులో ఉండేలా చూడడానికి సాధారణ ధరల నియంత్రణ పరిమితిని దాటి ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు మాత్రమే ఈ ‘పారా 19’ అనే అసాధారణ అధికారాన్ని ఉపయోగిస్తారు. కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం కింద పనిచేసే ఎన్పీపీఏ దేశంలో మందుల ధరలను పర్యవేక్షిస్తుంది.
ఎక్కువ ధరలను కోరుతూ ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేసుకున్న 82 మందుల ఫార్ములేషన్లను ఒక ప్రభుత్వ కమిటీ పరిశీలించిన తర్వాత ఈ ఆమోదం లభించింది. వీటిలో అత్యంత అత్యవసరమైనవిగా కేవలం నాలుగు మందులను మాత్రమే ఎంపిక చేశారు. అందులో కీమోథెరపీ మందులైన కార్బోప్లాటిన్, సిస్ప్లాటిన్ ఉన్నాయి.
ఔషధ కంపెనీలు ధరల పెంపును కోరడానికి ప్రధాన కారణాలు…మందుల తయారీకి వాడే ముడిపదార్థాల ధరలు భారీగా పెరగడం.ఉత్పత్తి వ్యయం పెరగడం. విదేశీ మారకద్రవ్య రేట్లలో (ఫారిన్ ఎక్స్ఛేంజ్) వచ్చే హెచ్చుతగ్గులు. ఈ కారణాల వల్ల ప్రస్తుత ధరలపై నిరంతరాయంగా మందులను తయారు చేయడం ఆర్థికంగా నష్టదాయకంగా మారిందని కంపెనీలు పేర్కొన్నాయి. దీనిని పరిశీలించిన కమిటీ.. ఒక కార్బోప్లాటిన్ ఇంజెక్షన్, ఒక సిస్ప్లాటిన్ ఇంజెక్షన్ మరియు రెండు యాంటీ-టెటానస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ల ధరలను సవరించాలని సిఫార్సు చేసింది.
ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో విస్తృతంగా ఉపయోగించే కార్బోప్లాటిన్ మరియు సిస్ప్లాటిన్ ఇంజెక్షన్ల కొరతపై టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ వ్యక్తం చేసిన ఆందోళనలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ప్రజారోగ్య కోణంలో ఈ కీలకమైన మందులు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడటం అత్యంత అవసరమని కమిటీ నొక్కిచెప్పింది.
Also Read:ఆసియా టెక్ షేర్లుపతనం..కారణమిదే!
మిగిలిన 78 మందుల ఫార్ములేషన్ల విషయమై కమిటీ మరికొంత అదనపు సమాచారాన్ని కోరింది. ఈ మందుల కొరత అనేది కేవలం సప్లై సమస్య మాత్రమే కాదు, ఇది ఆర్థికపరమైన సమస్య. ప్రస్తుత ధరల వద్ద మందులను ఉత్పత్తి చేస్తే నష్టాలు వస్తుండటంతో ఫార్మా కంపెనీలు వాటి ఉత్పత్తిని నిలిపివేశాయి. ఇప్పుడు ప్రభుత్వం ధరల పెంపునకు అంగీకరించడంతో, తయారీ కంపెనీలకు ఆర్థికంగా ఊరట లభించనుంది. దీనివల్ల వారు తిరిగి ఈ క్యాన్సర్ మందుల ఉత్పత్తిని భారీగా పెంచి, మార్కెట్లోకి సరఫరా చేసే అవకాశం ఉంటుంది.

