వినయ్ తండ్రి రాజేష్ నర్వాల్ తన బాధను మాటల్లో వ్యక్తపరచడానికి తడబడుతున్నారు. ఆ రోజు తర్వాత అంతా మారిపోయింది. బతకాలి కాబట్టి బతుకుతున్నాం.. కానీ నిజం చెప్పాలంటే, ఆ వార్త విన్న రోజే మా జీవితం ముగిసిపోయింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పహల్గామ్లో జరిగిన భయానక ఉగ్రదాడి జరిగి ఏడాది గడిచింది, కానీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబానికి మాత్రం సమయం అక్కడే ఆగిపోయింది. దేశానికి సేవ చేయాలనే తపన, ఎన్నో కలలు ఉన్న ఒక యువ నౌకాదళ అధికారిని కోల్పోయిన బాధ నేటికీ పచ్చిగానే ఉంది. ఏప్రిల్ 22, 2025న, కాశ్మీర్లో హనీమూన్ కోసం వెళ్లిన సమయంలో వినయ్ను ఉగ్రవాదులు అత్యంత సమీపం నుండి కాల్చి చంపారు. అప్పటికి ఆయన వయసు కేవలం 26 ఏళ్లు. పెళ్లై కొద్ది రోజులు కూడా గడవకముందే, కొత్త జీవితం ప్రారంభం కావాల్సిన చోట అంతా ముగిసిపోయింది.
కర్నాల్లోని తన నివాసంలో నిశ్శబ్దంగా కూర్చున్న వినయ్ తండ్రి రాజేష్ నర్వాల్ తన దుఃఖాన్ని ఆపుకుంటూ.. “చిన్న గాయాలు కాలంతో పాటు మానుతాయి. కానీ ఈ బాధ.. ఇది ఎప్పటికీ నాతోనే ఉంటుంది” అని అన్నారు. ఆయన గొంతులో కోపం కంటే, ఒక యువ కొడుకును కోల్పోయిన తండ్రి పడే అంతులేని ఆవేదన కనిపిస్తోంది.
వినయ్ తన కెరీర్, లక్ష్యాలు మరియు తన కుటుంబం కోసం నిర్మించుకోవాలనుకున్న జీవితం గురించి ఒక నోట్బుక్లో రాసుకునేవాడని తండ్రి గుర్తు చేసుకున్నారు. “అతను చాలా చిన్న వయసులోనే అధికారి అయ్యాడు. తన లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉండేది. ఇతరుల సమస్యను తన సమస్యగా భావించేవాడు” అని గతాన్ని గుర్తు చేసుకున్నారు. వినయ్ చిన్నప్పుడు తన వేలు పట్టుకుని నడిచిన జ్ఞాపకాన్ని తలచుకుంటూ రాజేష్ గొంతు మూగబోయింది. “అతను మాకు ఒక దేవదూత లాంటివాడు” అని అన్నారు.
Also Read:పిల్లలకు మాటలు ఆలస్యమవ్వడం ఆటిజమా?
దాడికి కొన్ని రోజుల ముందు వరకు ఆ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఏప్రిల్ 16న వినయ్ వివాహం జరిగింది. ఆ సంతోషం తీరకముందే ఆయన హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్లారు. “రిసెప్షన్ జరిగిన మూడు రోజులకే అంతా పోయింది. మా మీద కొండంత దుఃఖం వచ్చి పడింది” అని తండ్రి గుర్తు చేసుకున్నారు.చిన్నప్పటి నుంచి యూనిఫాం ధరించాలనేది వినయ్ కల. తన కుటుంబ సభ్యులను చూసి ప్రేరణ పొందిన ఆయన, దేశ సేవ కోసం ఎంతో శ్రమించారు. “మొదట ఎయిర్ ఫోర్స్లో చేరాలనుకున్నాడు, కానీ నేవీలో అవకాశం వచ్చినప్పుడు కూడా చాలా సంతోషించాడు. దేశానికి సేవ చేయడమే అతని ఏకైక లక్ష్యం” అని రాజేష్ చెప్పారు.

