ఇరాన్లో భూకంపం సంభవించి ప్రజల్లో ఆందోళన నెలకొంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అకస్మాత్తుగా భూమి కంపించడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ప్రాథమిక సమాచారం అందింది.
అధికారుల ప్రకారం మెహర్, బిద్ధన్ అఖండ్ ప్రాంతాల్లోని కొన్ని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. గోడల్లో చీలికలు ఏర్పడగా, కొన్ని పాత కట్టడాలు చిన్నపాటి నష్టాన్ని చవిచూశాయి. పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ఈ భూకంప ప్రభావం ఇరాన్కే పరిమితం కాకుండా పరిసర దేశాల్లోనూ కనిపించింది. ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్వల్ప భూప్రకంపనలు నమోదైనట్లు సమాచారం. అక్కడ కూడా ప్రజలు క్షణకాలం భయాందోళనకు గురయ్యారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Also Read:కేసీఆర్ను కలిసిన గూడెం మధుసూదన్

