తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. కరీంనగర్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మరో మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
నగరంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.ముఖ్యంగా పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read:కేటీఆర్కు సంతోష్ విషెస్

