కోమటిరెడ్డి బ్రదర్స్కు షాకిచ్చింది కాంగ్రెస్. తెలంగాణలో పార్టీ బలోపేతానికి 70మందితో కూడిన నాలుగు కమిటీలు వేసింది. అయితే ఈ కమిటీల్లో కోమటిరెడ్డి బ్రదర్స్… మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు నిరాశే ఎదురైంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కే.జానారెడ్డి, ఎన్. బాలునాయక్, బీర్ల అయిలయ్య యాదవ్ లకు కమిటీల్లో చోటు కల్పించడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మింగుడుపడని వ్యవహారంగా మారింది. అధిష్టానం కావాలనే వీరిని పక్కకు పెట్టిందా లేదా యాదృచ్చికంగా జరిగిందా అన్న దానిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.
కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖలకు నిరాశే ఎదురైంది. అయితే రాజకీయ వ్యవహారాల కమిటీలో మంత్రులను ప్రత్యేక ఆహ్వానితులుగా పేర్కోనడం కాసింత ఊరట కలిగించే అంశం. అయితే రాజగోపాల్ రెడ్డిని, వివేక్ ను కేబినెట్ లో తీసుకోబోతున్నందునే వారికి పీసీసీ కమిటీల్లో స్థానం కల్పించలేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. మరి నేడో రేపో ప్రకటించే పీసీసీ కార్యవర్గంలో, కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డి, వివేక్ ల పేర్లు లేకపోతే గాంధీ భవన్ రచ్చరచ్చగా మారడం ఖాయమని తెలుస్తోంది.
Also Read:బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు

