సెమీస్ లో విజయం.. అయిన సరి చేసుకోవాల్సిందే!

42
- Advertisement -

టీమిండియా విన్నింగ్ స్ట్రాటజీని అలాగే కొనసాగిస్తోంది. న్యూజిలాండ్ తో జరిగిన ఉత్కంఠభరిత సెమీస్ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన ప్రత్యర్థి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి అదరహో అనిపించింది. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ ( 47 ), శుబ్ మన్ గిల్ ( 80 ), విరాట్ కోహ్లీ ( 105 ) కే‌ఎల్ రాహుల్ ( 39 ) రాణించడంతో కివీస్ ముందు భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తరువాత బౌలింగ్ లోనూ టీమిండియా బౌలర్లు విశ్వరూపం చూపించడంతో కివీస్ 327 పరుగులకు ఆలౌట్ గా నిలిచింది.

మహ్మద్ షమి నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఏడు వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచాడు. డేవిడ్ కాన్వే, రచన్ రవీంద్ర వంటి భీకరమైన బ్యాట్స్ మెన్స్ ను వెంటవెంటనే అవుట్ చేసినప్పటికీ ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కెన్ విలియమ్సన్, డెరీ మిచెల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతూ విజయం వైపుగా అడుగులు వేశారు. కానీ షమి అద్బుతామన ఫేస్ బౌలింగ్ ధాటికి వారు కూడా నిలువలేకపోయారు. మొత్తం మీద ఏడు కీలక వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో మహ్మద్ షమికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. ఇక కప్పు వేటలో అడుగు దూరంలో నిలిచిన టీమిండియాతో ఫైనల్ లో తలపడే జట్టు ఏదో చూడాలి.

లోటుపాట్లు సరి చేసుకోవాల్సిందే

ఈ వరల్డ్ కప్ లో లీగ్ దశ నుంచి అద్బుత విజయాలను నమోదు చేస్తూ వచ్చిన టీమిండియా, సెమీస్ లో మాత్రం కొంత తడబడిందని మాజీలు అభిప్రాయ పడుతున్నారు. లీగ్ దశలో జట్టు ఏదైనా ఎలాంటి ఒత్తిడి లేకుండా విజయాలు సాధిస్తూ వచ్చిన రోహిత్ సేన.. సెమీస్ లో మాత్రం ఒత్తిడికి లోనవుతూ ధారాళంగా పరుగులు ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా ఫీల్డింగ్ విభాగంలో లోపాలను సరిచేసుకోవాల్సిన అసవరత ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లైట్ ఎఫెక్ట్ కారణంగా రోహిత్ మిచెల్ క్యాచ్ వదిలేయడం, కీపర్ వెనుక ఎక్కువగా పరుగులు ఇవ్వడం, ఫీల్డింగ్ లో భారత ఆటగాళ్లు చురుకుగా లేకపోవడం.. నిన్నటి మ్యాచ్ లో చూస్తూ వచ్చాం. ఫైనల్ లో ఇలాంటి తప్పులు జరగకుండా ఫీల్డింగ్ విభాగంలో రోహిత్ సేన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:కుంకుడు కాయతో జుట్టు స్ట్రాంగ్ అవుతుందా?

- Advertisement -