ప్రతిరోజూ గుప్పెడు శనగలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. శనగలలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలుగజేస్తాయి. శాకాహారులకు బలమైన ఆహారంగా శనగలను పరిగణిస్తారు నిపుణులు. మన శరీరానికి ఒకరోజుకు అవసరమయ్యే ప్రోటీన్ శాతంలో మూడవ వంతు శనగలు తీసుకోవడం ద్వారా లభిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్ ఉన్నవారికి శనగలు మంచి ఆహారం.. వీటిని తినడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
తద్వారా మధుమేహం త్వరగా కంట్రోల్ అవుతుంది. ఇంకా ఇందులో కాల్షియం, పొటాషియం, విటమిన్ ఏ, సి, ఇ వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. తద్వారా ఎముకలు కండరాలు శక్తివంతంగా మారేందుకు దోహద పడతాయి. ఇంకా ఇందులో ఉండే ఐరన్ రక్త హీనత సమస్యను దూరం చేస్తుంది. అలాగే శనగల్లో పీచు పదార్థం క్దుయ ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగు పడడంతో పాటు మలబద్ధకం కూడా దూరమౌతుంది. ఇంకా ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉండటంలో సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండెలో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదాన్ని తగ్గించి చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపడంలో శనగలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా శనగలు తినడం వల్ల నిద్రలేమి, తలనొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయట. అందుకే ప్రతిరోజూ గుప్పెడు శనగలు తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.
Also Read:జీఎస్ఎల్వీ ఎఫ్ 14 … గ్రాండ్ సక్సెస్