ఆచార్య సెట్ అగ్గి పాలైంది

37
- Advertisement -

మెగా ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని అల్ట్రా డిజాస్టర్ ఆచార్య తాలూకు జ్ఞాపకాలు ఫ్యాన్స్ ని ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. షూటింగ్ సమయంలో మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ధర్మస్థలి సెట్ గురించి అందరికి గుర్తుండే ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ సెల్వ రాజన్ నేతృత్వంలో సుమారు 25 కోట్ల ఖర్చుతో దాన్ని నిర్మించారు. గత ఏడాది దీని మేకింగ్ వీడియోలతో చిరంజీవి ఓ రేంజ్ లో అంచనాలు పెంచడం సోషల్ మీడియాలో చూశాం. ఇప్పుడా నిర్మాణం మంటల పాలైంది. నిన్న పొద్దుపోయాక చిన్నగా అంటుకున్న అగ్గిరవ్వ క్షణాల్లో వ్యాపించిపోయింది. మంటలను త్వరగానే అదుపులోకి తెచ్చారు.

నిర్లక్ష్యంగా సిగరెట్ వెలిగించి పారేయడం వల్లని ఒకరు లేదూ షార్ట్ సర్క్యూట్ అయ్యిందని మరొకరు ఇలా రకరకాల కారణాలు చెబుతున్నారు కానీ ఇంకా సరైన రీజన్ ఏంటో పోలీసులు తేల్చాల్సి ఉంది. హైదరాబాద్ శివారులో కోకాపేటలో ఈ సెట్ ని వేశారు. ఇరవై ఎకరాల స్థలంలో కొంత కాలం ఉండేలా పటిష్టంగా కట్టారు. సినిమా ఫ్లాప్ అయ్యాక ఎవరూ పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటిస్తోన్న కిసీకా భాయ్ కిసీకా జాన్ లోని కీలక భాగం ధర్మస్థలిలోనే కొంత మరమత్తులు జరిపి చేసుకున్నారు. ఈ షెడ్యూల్ లో వెంకటేష్, పూజా హెగ్డేతో పాటు రామ్ చరణ్ చిన్న క్యామియోలో నటించాడు

ప్రమాదం ఎలా జరిగిందనేది బయటికి వస్తేనే బాద్యులు ఎవరో తేలుతుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ చేసి ఉంటే నష్టం మొత్తం పరిహారం రూపంలో అందుతుంది. ఇంత భారీ సెట్ కాబట్టి ఖచ్చితంగా చేసే ఉంటారని మీడియా టాక్. నిజానికి ధర్మస్థలి ప్రాంగణంలో భవిష్యత్తులో మరికొన్ని స్టార్ హీరోల చిత్రాలు ప్లాన్ చేసుకున్నారు. నాణ్యత ఉన్న నిర్మాణం కావడంతో తమ కథకు సూటవుతుందనుకున్న వాళ్లంతా దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడిలా జరిగిపోయింది కాబట్టి పూర్తిగా తీసేస్తారేమో. రిపేర్లు చేసే అవకాశం దాదాపు లేనట్టే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -