ఆరోగ్యతెలంగాణలో ఏఎన్ఎం సెంటర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా త్వరలోనే అప్గ్రేడ్ చేస్తామని మంత్రి తెలిపారు. బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణమండపంలో ఏఎన్ఎంల 2వ మహాసభలో మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. ఏఎన్ఎంలు రెండో మహాసభలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
కరోనా సమయంలో ఏఎన్ఎంలు అందించిన సేవలు అమూల్యమని ప్రశంసించారు. వైద్యారోగ్య, పారిశుద్ధ్య, పోలీసులు కలిసి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేశారని కొనియాడారు.ప్రాథమిక వైద్యం అందించడంలో ఏఎన్ఎంలది కీలకపాత్ర అని హరీశ్రావు పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్లో ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషించాలన్నారు. బీపీ, షుగర్, క్యార్సర్ వ్యాధి సోకినట్లు చాలా మందికి తెలియదు. అలాంటి వారిని ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే.. రోగాలకు దూరంగా ఉండొచ్చని సూచించారు.
హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన 350 బస్తీ దవాఖానాలు సూపర్ హిట్ అయ్యాయని హరీశ్రావు పేర్కొన్నారు. ఈ దవాఖానాల ఏర్పాటుతో గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో ఓపీ తగ్గిందన్నారు. జిల్లాల్లో కూడా బస్తీ దవాఖానలు పెడుతున్నాం. మొత్తం 500 ఏర్పాటు చేస్తున్నాం. ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖనలుగా అప్ గ్రేడ్ చేస్తున్నాం. ఈ నెలలో 2000 పల్లె దవాఖానాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోబోతున్నాము అని హరీశ్ రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..