ధాన్యం కొనుగోళ్లుపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష..

125
niranjan reddy
- Advertisement -

ధాన్యం కొనుగోళ్లు, ఇబ్బందులు, కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, అబ్రహం, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని.. వీలైనన్ని ఎక్కువ వాహనాలను రవాణాకు వాడుకోవాలి.మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే అన్ లోడ్ చేయాలి. ఆయా మిల్లులలో స్థల సమస్య ఉంటే పక్క మిల్లుకు, పక్కన ఉన్న గోదాంలకు పంపించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎంతో చేయూతనిచ్చి పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తుంటే చిన్న చిన్న తప్పిదాలతో రైతులకు నష్టం కలిగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అని మంత్రి సూచించారు. క్రాప్ బుకింగ్‌లో నమోదు కాలేదన్న సాకుతో రైతుల ధాన్యం కొనుగోలును తిరస్కరించవద్దు. క్రాప్ బుకింగ్ సమస్యలుంటే తరువాత శాఖాపరమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.. సరిహద్దు జిల్లాలలో అప్రమత్తంగా ఉంటే చాలు. కొన్ని జిల్లాల నుండి మొక్కజొన్న కొనుగోళ్ల కోసం విజ్ఞప్తి వస్తుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామన్నారు.

హమాలీల సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకోవాలి. తరుగు తీసే విషయంలో తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి.. ఫిర్యాదులు వస్తున్న జిల్లాల మీద కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. మార్చి 31 లోపు పంటల కోతలు పూర్తయ్యేలా చూసుకుంటే పంట నష్టాలు ఉండవు. సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో రైతులను ఈ దిశగా చైతన్యం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రకృతి విపత్తులైన గాలివానలను, వాటి వలన జరిగే నష్టాలను మనం నివారించలేము. కరోనా మహమ్మారి నివారణకు వైద్యసిబ్బంది కృషి అమోఘమని మంత్రి అభినంధించారు. కరోనా లక్షణాలుంటే చికిత్స మొదలుపెట్టాలి. కరోనా నివారణకు అవసరమైన సదుపాయాల కల్పనకు, వచ్చే నెలలో అవసరమైన కిట్ల వివరాలు సమర్పించండి అని మంత్రి ఆదేశించారు.

వేసవి నేపథ్యంలో ఎండవేడిమి కేసులు కూడా వస్తాయి.. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటింటి జ్వర సర్వేలు ఖచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోండి. జ్వర సర్వేల విషయంలో ప్రజలు, జ్వర పీడితుల నుండి ఎలాంటి స్పందన ఉంది ? వారు ప్రభుత్వం నుండి ఎలాంటి సేవలు ఆశిస్తున్నారు ? ఇంకా ఏం చేయాలని సూచిస్తున్నారు? అని మంత్రి అధికారులను అడిగారు. కరోనా కేసులు హైదరాబాద్ వరకు వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే మెరుగైన చికిత్స అందేలా చూడాలి. గత నాలుగు రోజుల నుండి కరోనా కేసులు తగ్గుతున్నాయని మంత్రికి కలెక్టర్లు వెల్లడించారు.మరొక రెండు మాసాలు అందరం కలిసికట్టుగా కృషి చేసి దీనిని దైవ కార్యంగా భావించి.. మనందరం ప్రజలను ఈ విపత్తు నుండి బయటపడేద్దాం..అయినవారే దూరం పెడుతున్న పరిస్థితులలో కరోనా విపత్తులో వైద్యసిబ్బంది, ఆశా వర్కర్ల సేవలకు చేతులెత్తిమొక్కాలి అని మంత్రి ప్రశంసించారు.

- Advertisement -