Congress:ఛలో ఢిల్లీ..సీఎం లొల్లి?

38
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ ముందున్న అతి పెద్ద సవాల్ సి‌ఎం ఎంపిక. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో సి‌ఎం పదవి విషయంలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందు దాదాపు అరడజన్ మంది నేతలు సి‌ఎం అభ్యర్థిగా ఉండేందుకు పోటీ పడుతూ వచ్చారు. అందుకే అధిష్టానం కూడా ఎన్నికల ముందు సి‌ఎం అభ్యర్థి ఎంపిక చేపట్టకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇక ఇప్పుడు కచ్చితంగా సి‌ఎం అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని, ఆయననే సి‌ఎం అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీలో కొంతమంది డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ ఆల్రెడీ సి‌ఎం రేస్ లో ఉన్న భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటివారు ఎంతవరకు మద్దతిస్తారనేది అంతుచిక్కని ప్రశ్న.

నిన్న జరిగిన సిఎల్పీ సమావేశంలో కూడా సి‌ఎం ఎంపిక జరగకపోవడంతో హస్తం హైకమాండ్ కు ఈ అంశం అగ్ని పరీక్షగా మారింది. సి‌ఎం పదవికి తాము అర్హులమేనని భట్టి, ఉత్తమ్.. డిల్లీకి మకాం వేశారు. ప్రస్తుతం డిల్లీ కేంద్రంగా సి‌ఎం ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఒకవేళ రేవంత్ రెడ్డిని సి‌ఎంగా ప్రకటిస్తే.. వీరిద్దరి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ లో కుర్చీలాట మొదలైందనే చెప్పాలి. మరి హస్తం హైకమాండ్ ఈ సమస్యను అధిగమించి ఎవరిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందో చూడాలి. అయితే సి‌ఎం ఎంపిక జరిగిన తరువాత హస్తం పార్టీలో ముసలం మరింత పెరిగే ఛాన్స్ ఉందనేది కొందరి అభిప్రాయం. మరి ప్రస్తుతం కాంగ్రెస్ లో నెలకొన్న సి‌ఎం లొల్లి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Also Read:షారుఖ్ కోసం దీపికా ఇంత చేసిందా?

- Advertisement -