వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదివారం కీలక ప్రకటన చేశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. షర్మిల పాదయాత్రలో భాగంగా ఆదివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సమీపంలోని బౌద్ధ స్తూపం రహదారి వద్ద పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా షర్మిల ఈ మేరకు ప్రకటన చేశారు. పాలేరు నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రారంభం కావాలని ఆమె ఆకాంక్షించారు.
ఖమ్మం జిల్లా పరిధిలోని బయ్యారం గనుల్లో తనకు వాటాలున్నాయంటూ వస్తున్న విమర్శలపైనా వైఎస్ షర్మిల స్పందించారు. బయ్యారం గనుల్లో తనకు వాటాలు లేవని ఆమె తేల్చిచెప్పారు. ఈ విషయంపై తాను తన బిడ్డల మీద ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు.