మెగాహీరో వరుణ్ తేజ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కథల విషయంతో జాగ్రత్తలు పాటిస్తున్నాడు. గతంలో ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్నాడు. ‘ఘాజీ’ సినిమాతో ఓ సరికొత్త ప్రయోగానికి తెరతీసి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సంకల్ప్ రెడ్డి.
ఈ సినిమా జాతీయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ప్రయోగాత్మక సినిమాలు చేసే ఈ యువ దర్శకుడితో ప్రస్తుతం వరుణ్ ఓ సినిమా చేస్తున్నాడు.ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ గ్యాప్ లేకుండా చిత్రీకరిస్తున్నారు. ఇస్రో వాతావరణానికి తగ్గట్టుగా స్పెషల్గా ఓ సెట్ కూడా వేశారట.
ఈ చిత్రాన్ని అంతరిక్షం నేపధ్యంలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమాకు ‘వ్యోమగామి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం వరుణ్ ప్రత్యేకంగా గ్రావిటీలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. రాజీవ్ రెడ్డి, క్రిష్(దర్శకుడు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.