వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్కు అర్హత సాధించి, 12 ఏళ్ల కరవును ముగించేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందనే నమ్మకాన్ని స్కాట్లాండ్ ప్రధాన కోచ్ ఓవెన్ డాకిన్స్ వ్యక్తం చేశారు. స్కాట్లాండ్ ఇప్పటివరకు 50 ఓవర్ల ప్రపంచకప్లో మూడు ఎడిషన్లలో మాత్రమే పాల్గొంది. చివరిసారిగా 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో జరిగిన వన్డే ప్రపంచకప్లో ఆడి, ఆరింటిలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.
అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం ద్వారా వచ్చే ఏడాది జరగబోయే ‘క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్’ ఈవెంట్లో స్కాట్లాండ్ ఇప్పటికే స్థానాన్ని ఖరారు చేసుకుంది. దక్షణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగే ప్రపంచకప్లో అడుగుపెట్టడానికి స్కాట్లాండ్ ఇప్పుడు కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది.
2027 ప్రారంభంలో జరిగే క్వాలిఫైయర్ ఈవెంట్లో టాప్-4లో నిలిస్తే స్కాట్లాండ్కు ప్రపంచకప్ బెర్త్ ఖాయమవుతుంది. గత ఏడాది చివరిలో బాధ్యతలు చేపట్టిన డాకిన్స్, తమ జట్టు ప్రపంచకప్కు అర్హత సాధించకపోవడానికి ఎలాంటి కారణమూ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మేము ప్రస్తుతం చాలా మంచి స్థితిలో ఉన్నాం…ఈ సిరీస్ స్కాట్లాండ్ జట్టులోని పట్టుదలను, నాణ్యతను నిరూపించింది. గ్లోబల్ క్వాలిఫైయర్కు అర్హత సాధించడం అనేది ఒక గొప్ప సాధన. ఇందులో భాగస్వాములైన ప్రతీ ఒక్కరూ మేము సాధించిన పురోగతి పట్ల గర్వపడవచ్చు అని తెలిపారు.
ప్రపంచ క్రికెట్లో వన్డే ఫార్మాట్ ఇప్పటికీ చాలా కీలకమైనది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరిగే ప్రపంచకప్కు చేరుకోవడం అనేది మా జట్టుకు ఒక అద్భుతమైన విజయం అవుతుంది. క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, ఈ క్రీడ మరింత బలంగా ఎదుగుతూ నిలదొక్కుకోవడానికి ప్రపంచ క్రికెట్ ఈ ఫార్మాట్లో పెట్టుబడులు కొనసాగించాల్సిన అవసరం ఉంది అన్నారు.
Also Read:రామమందిర విరాళాల చోరీ..తుది నివేదిక

