ఈ వేసవిలో కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర స్థాయి వాతావరణ పరిశీలనా కమిటీ నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
నివేదిక ప్రకారం…రాబోయే నెలల్లో మొత్తం 207 తాలూకాల్లో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఇప్పటికే 60 తాలూకాలు ప్రభావితమయ్యాయి. గ్రామ స్థాయిలో 2,258 గ్రామ పంచాయతీలు ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించగా, వాటిలో 212 గ్రామ పంచాయతీలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.
ప్రభావం కొన్ని జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఉత్తర కన్నడ, బెలగావి, కలబురిగి, తుమకూరు జిల్లాల్లో ఎక్కువ తాలూకాలు ప్రభావితమయ్యాయి. గ్రామ పంచాయతీల పరంగా కలబురిగి జిల్లాలోనే ఎక్కువ ప్రభావం ఉండగా, తర్వాత ఉత్తర కన్నడ, హావేరి, మండ్య, బెలగావి జిల్లాలు ఉన్నాయి.
ప్రభుత్వం ఇప్పటికే నివారణ చర్యలు ప్రారంభించింది. ప్రభావిత ప్రాంతాలకు నాలుగు ప్రభుత్వ ట్యాంకర్లు, 56 ప్రైవేట్ ట్యాంకర్లు ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. అదనంగా 270 ప్రైవేట్ బోర్వెల్లను వినియోగంలోకి తీసుకుని, 246 గ్రామాలకు నీటిని అందిస్తున్నారు.
మార్చి నుంచి మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉత్తర అంతర్గత కర్ణాటకతో పాటు దక్షిణ ప్రాంతాల్లోని కోలార్, చిక్కబళ్లాపూర్, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్ జిల్లాల్లో 3 నుంచి 6 రోజులు హీట్వేవ్ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
ఇక జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇది 2026 చివరి వరకు కొనసాగే అవకాశం 62%గా అంచనా వేయబడింది. ముఖ్యంగా జూలై, ఆగస్టు నెలల్లో కృష్ణా, కావేరి నది పరివాహక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గే ప్రమాదం ఉంది.
Also Read:కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కాగ్
వర్షపాతం తగ్గడం, అధిక ఉష్ణోగ్రతల వల్ల వ్యవసాయ దిగుబడి తగ్గే అవకాశం ఉంది. రైతులపై ఒత్తిడి పెరుగుతుంది. నీటి కొరత కారణంగా అడవి జంతువులు గ్రామాల వైపు రావడం పెరిగే అవకాశం ఉంది. అలాగే వేడి, నీటి కొరత కారణంగా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

