బాబు ‘యూపీఏ 3’ కలిసొచ్చేదెవరో..!

368
chandrababu
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల సమరం ఇంకా ముగియకముందే రాజకీయాలు తారాస్ధాయికి చేరుకున్నాయి. బీజేపీని అధికారంలోకి రాకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో పలు ప్రాంతీయ పార్టీల నేతలు,కాంగ్రెస్ నేతలు శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఇక బీజేపీయేతర ప్రభుత్వా ఏర్పాటులో కీ రోల్ పోషిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. యూపీఏ 3 ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషిస్తున్న బాబు ఈ నెల 21 బీజేపీయేతర పక్షాలతో సమావేశం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏ పార్టీకి మెజార్టీ రాని ప‌క్షంలో యూపీఏలో మ‌రిన్ని పార్టీల‌ను క‌లుపుకునినేలా ఎత్తులు వేస్తున్నారు.

ఇందులో భాగంగానే మే 23కు రెండు రోజుల ముందు 21న యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశానికి ఎస్పీ, బీఎస్పీ, తృణ‌మూల్‌, వామ‌ప‌క్షాలు, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ, నేష‌న‌ల్ కాన్ఫరెన్సు, డీఎంకే, జేడీఎస్ సహా కీల‌క భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను ఆహ్వానించాల‌ని చంద్రబాబు నిర్ణయించారు.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాతో పాటు సీట్ల ఆధారంగా యూపీఏ-3 ప్రభుత్వ ఏర్పాటుకు అనుస‌రించాల్సిని విధానాల‌పై చ‌ర్చించ‌నున్నారు. అయితే ఈ స‌మావేశానికి ఎన్ని పార్టీలు హాజరవుతాయనేది సందిగ్దంగా మారింది. ఎందుకంటే జేడీఎస్‌, డీఎంకే, ఆప్‌, నేష‌న‌ల్ కాన్ఫరెన్సు, ఎన్‌సీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. కాబట్టి వీరు ఈ సమావేశానికి తప్పకుండా హాజరవుతారు.

ఇక ప్రాంతీయ పార్టీల్లో పెద్దన్నగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ, తృణ‌మూల్‌, వామ‌ప‌క్షాలు, ఆప్ కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా పోటీ చేశాయి.వీరు కాంగ్రెస్ తో కలిసేందుకు పెద్దగా ఆసక్తిచూపడం లేదు.దీంతో  ఈ పార్టీలు యూపీఏ 3 సమావేశానికి హాజ‌ర‌వుతాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. సో మొత్తంగా యూపీఏ 3లో పెద్దన్న పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న చంద్రబాబు ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

- Advertisement -