TTD:రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌

14
- Advertisement -

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన‌ట్టు టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తెలిపారు. ఛైర్మ‌న్ అధ్యక్ష‌త‌న సోమ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

() ధర్మప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారుచేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందిన తరువాత భక్తులకు విక్రయించేందుకు నిర్ణయం. ఇవి 5 గ్రాములు, 10 గ్రాముల్లో ఉంటాయి. వీటిని నాలుగు లేదా ఐదు డిజైన్లలో తయారు చేస్తాం. వీటితోపాటు లక్ష్మీకాసులను కూడా తయారు చేయాలని నిర్ణయం. వీటిని లాభాపేక్ష లేకుండా విక్ర‌యిస్తాం. గ‌తంలో 32 వేల మందికి సామూహిక వివాహాలు జ‌రిపించిన‌పుడు మంగ‌ళ‌సూత్రాలు అందిస్తే ఏ ఒక్క‌రూ మ‌తం మార‌లేదు. మ‌హిళ‌ల‌కు స్వామివారి కానుక ఇది.

()టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్‌ రోడ్డు ఏర్పాటుకు టెండరు ఆమోదం.

() దాదాపు 30 ఏళ్లుగా ఇళ్లస్థలాల కోసం ఎదురుచూసిన టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన మాన్య ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

()టీటీడీలోని వివిధ విభాగాల‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ప‌నిచేసే వారికి వేత‌నాలు పెంచాం.

()టీటీడీ పోటు విభాగంలోని 70 మంది కాంట్రాక్టు లడ్డూ ట్రే లిఫ్టింగ్‌ సెమి స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ కార్మికులను స్కిల్డ్ కార్మికులుగా మార్పు చేసి వారి వేతనాలను రూ.12,523/- నుండి రూ.15 వేలకు పెంచేందుకు ఆమోదం.

() అన్న‌దాన విభాగంలో 138 మంది క్లీన‌ర్లు, 79 మంది వంట మనుషులను స్కిల్డ్ కేట‌గిరీలోకి మార్చి వారి వేత‌నాలను రూ.17 వేల నుండి రూ.22 వేల‌కు పెంపు.

() ఎల‌క్ట్రిక‌ల్, వాట‌ర్ వ‌ర్క్స్ విభాగాల్లో ప‌నిచేసే కార్మికుల‌ను అన్‌స్కిల్డ్ నుండి స్కిల్డ్ కేటగిరీలోకి మార్పు.

Also Read:ఆలుగ‌డ్డ జ్యూస్‌తో ప్రయోజనాలు?

() శ్రీ వెంక‌టేశ్వ‌ర శిల్ప క‌ళాశాల‌లో వివిధ దేవ‌తామూర్తుల శిల్పాల‌ను త‌యారుచేస్తున్న శిల్పుల క‌ళానైపుణ్యాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా, వారి వేత‌నాల పెంపుద‌ల‌కు ఆమోదం.

() క‌లంకారి క‌ళ‌లో నిపుణులైన శ్రీ మున‌స్వామిరెడ్డి వేత‌నం రూ.25 వేల నుండి రూ.39 వేలకు పెంపు.

() టీటీడీ అనుబంధ‌, విలీన ఆల‌యాల్లో విధులు నిర్వ‌హిస్తున్న కాంట్రాక్టు అర్చ‌కులు, సంభావ‌న అర్చ‌కుల వేత‌నాల‌ను రూ.26 వేల నుండి రూ.31 వేల‌కు పెంచేందుకు ఆమోదం.

() టీటీడీ స్టోర్‌లో ప‌నిచేసే 9 మంది వ‌ర్క‌ర్ల‌కు వారి వేత‌నం రూ.9 వేల నుండి రూ.15 వేల‌కు పెంచ‌డం జ‌రిగింది.

() ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ద్వారా సేవ‌లందిస్తున్న క్ర‌మాపాఠీల‌కు రూ.16 వేల నుండి రూ.22 వేల‌కు, ఘ‌నాపాఠీల‌కు రూ.17 వేల నుండి రూ.25 వేల‌కు సంభావ‌న‌ పెంపు.

() అదేవిధంగా, 1400 మంది వేద‌పారాయణదారుల‌కు ప్ర‌స్తుతం ఇస్తున్న పెన్ష‌న్ రూ.10 వేల నుండి రూ.12 వేల‌కు పెంపు.

() హైందవ సనాతన ధర్మప్రచారంలో భాగంగా వేదవిద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో ఆరు వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను రూ.35 వేల నుండి రూ.54 వేలకు పెంచేందుకు ఆమోదం.

()టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానికాలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగినంత సిబ్బందితో ఆలయ కైంకర్యాలు తదితర సేవలు నిర్వహించేందుకు నూతన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వ ఆమోదానికి పంపేందుకు నిర్ణయం.ఇందులో భాగంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో 227 వేదపారాయణందారు, అధ్యాపక, మేళం సిబ్బంది పోస్టులు, టీటీడీ విలీనం చేసుకున్న ఆలయాల్లో 288 అర్చక, పరిచారిక, పోటు వర్కర్‌, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్‌, వేదపారాయణందారు, మేళం సిబ్బంది పోస్టులు ఉన్నాయి.

()తిరుమలలోని ఆకాశగంగ నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు రూ.30.71 కోట్లతో టెండరు ఆమోదం.

() తిరుమల శ్రీవారి దర్శనానికి దేశవ్యాప్తంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రూ.2.28 కోట్లతో సప్తగిరి సత్రాలు-6, 7 బ్లాకుల అభివృద్ధి పనుల కోసం టెండరు ఆమోదం.

() తిరుమలలోని శ్రీవేంకటేశ్వర, ఆదిశేషు, శంకుమిట్ట విశ్రాంతి గృహాల అభివృద్ధి మరియు పెయింటింగ్‌ పనుల కోసం రూ.10.90 కోట్లు మంజూరుకు పరిపాలన అనుమతికి ఆమోదం.

() ఆకాశరాజు నిర్మించిన అతిప్రాచీనమైన నారాయణవనంలోని శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయానికి రాజగోపురం, రాతిప్రాకారం నిర్మాణానికి రూ.6.90 కోట్లు మంజూరుకు ఆమోదం.

() రాష్ట్ర విభజన అనంతరం, ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లలకు ప్రత్యేకించి వైద్యసేవలు అందించాలన్న ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి సూచనల మేరకు తిరుపతి నగరంలో శ్రీవారి పాదాల చెంత శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడమైనది. భారతదేశంలోనే చిన్నారులకు సంబంధించి ప్రత్యేక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆవిర్భవించనున్న ఈ ఆసుపత్రిని ఇకపై శ్రీ పద్మావతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్‌గా వ్యవహరించడం జరుగుతుంది.

() టీటీడీ పాలనా వ్యవహారాలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు గాను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఐదేళ్ల కాలపరిమితికి గాను ఓరాకిల్‌ ఫ్యూజన్‌ క్లౌడ్‌ ఇఆర్‌పి ప్రవేశపెట్టేందుకు ఆమోదం.

()తిరుమల అన్నమయ్య భవనం సమావేశ మందిరం ఆధునీకరణలో భాగంగా దృశ్యశ్రవణ అనుసంధాన పరికరాల ఏర్పాటుకు ఆమోదం.

- Advertisement -