టిటిడికి అనుబంధంగా ఉన్న విజయవాడలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ జూలై 26 నుండి 31వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు శాస్త్రోక్తంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అష్టబంధన మహా సంప్రోక్షణ చేపట్టడం ఆచారంగా వస్తోంది. ఈ కార్యక్రమానికి జూలై 26వ తేదీ శనివారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 08.30 గం.ల వరకు మృత్సంగ్రహణము, అంకురార్పణము చేపట్టనున్నారు.
ఇందులో భాగంగా జూలై 27వ తేదీ ఉదయం 09.00 – 12.00 గం.ల వరకు అగ్ని మథనము, పంచాగ్ని ప్రణయనము, అగ్ని ప్రతిష్ట, సాయంత్రం 06.30 గం.లకు బింబాత్ కుంభే కళాపకర్షణ, ఉపచార సమర్పణము, ఉక్త హోమములు చేపడుతారు. జూలై 28న సోమవారం ఉదయం 09.00 గం.లకు నవగ్రహారాధన, నవగ్రహమఖము, ప్రధాన హోమములు, సాయంత్రం 06.30 గం.లకు ఉత్క హోమములు, కుంభ రాధనలు, అభి మంత్రణము నిర్వహిస్తారు. జూలై 29వ తేదీన ఉదయం 09.00 గం.లకు సర్వ శాంతి హోమములు, సాయంత్రం 06.30 సర్వ దోషాపశమనార్ధము సహస్రాహుతి హోమములు చేపడుతారు.
Also Read:విజయవాడ, విశాఖ మెట్రో..టెండర్లు
జూలై 30వ తేదీ ఉదయం 09.00గం.ల నుండి అష్టబంధన ద్రవ్యా రాధనము, మహా శాంతి హోమములు, ఉష్ణ బంధనము, అష్టబంధ ప్రయోగము, సాయంత్రం 04.00 గం.లకు సర్వ దోషప్రాయశ్చిత్త శాంతి హోమము, రాత్రి 07.00 గం.లకు మహా శాంతి తిరుమంజనము, ధాన్యా ధివాసము, సర్వ దైవత్య హోమము చేపడుతారు. జూలై 31వ తేదీ ఉదయం 07.30 గం.లకు మహా పూర్ణాహుతి, ఆలయ ప్రవేశము, అనంతరం చిత్త నక్షత్ర యుక్త గురువారము తులాలగ్న శుభముహుర్తమున ఉదయం 11.25 గం.ల నుండి 12.24 గం.ల వరకు కళావాహనం, ప్రథమ కాలార్చనము, మహా సంప్రోక్షణ, అక్షతారోహణ, బ్రహ్మ ఘోష తదితర కార్యక్రమాలు చేపడుతారు.

