అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరికొత్త టారీఫ్లను భారత్ సహా 60 దేశాలపై విధించేందుకు రెడీ అయ్యాడు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల నుండి దిగుమతి అవుతున్న వస్తువులు వెట్టిచాకిరి ద్వారా ఉత్పత్తి అవుతున్నాయని తమ దర్యాప్తులో తేలిందని అమెరికా ప్రకటించింది. దీని ఆధారంగా భారత్తో సహా 60 దేశాలపై 10 శాతం అదనపు సుంకం …మరికొన్ని దేశాలపై 12.5 శాతం అదనపు పన్ను విధించేలా అమెరికా ఒక కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది.
వెట్టిచాకిరితో తయారయ్యే వస్తువుల దిగుమతిని నిషేధించడంలో 54 ఆర్థిక వ్యవస్థలు విఫలమయ్యాయని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) జాబితా చేసింది. ఈ జాబితాలో భారతదేశం, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, రష్యా, యూకే, యూఏఈ వంటి ప్రముఖ దేశాలు ఉన్నాయి.
1974 వాణిజ్య చట్టంలోని ‘సెక్షన్ 301’ కింద ఈ చర్యలు తీసుకుంటున్నట్లు USTR తెలిపింది. వెట్టిచాకిరి ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులను అరికట్టడంలో విఫలమైన 60కి పైగా దేశాల విధానాలు సహేతుకంగా లేవని, ఇవి అమెరికా వాణిజ్యానికి భారం కలిగిస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికే వెట్టిచాకిరి దిగుమతులపై ఏదో ఒక రూపంలో నిషేధం విధించిన లేదా వాణిజ్య ఒప్పందాల ద్వారా ఇటువంటి చర్యలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన దేశాలపై 10 శాతం అదనపు సుంకం, మిగిలిన ఆర్థిక వ్యవస్థలపై 12.5 శాతం అదనపు పన్నును యూఎస్ ప్రతిపాదిస్తోంది. ఐరోపా సమాఖ్య , పాకిస్తాన్, కెనడాతో సహా ఆరు దేశాలను ఈ విషయంలో ప్రత్యేకంగా ఎత్తిచూపింది.
అమెరికా ఈ కొత్త సుంకాలను ప్రతిపాదించిన సమయం చాలా కీలకమైనది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని (BTA) ఖరారు చేయడానికి భారత్లో పర్యటిస్తున్న అమెరికా బృందంతో భారత ప్రతినిధులు చర్చలు జరుపుతున్న తరుణంలోనే ఈ ప్రతిపాదన వచ్చింది. జూన్ 1 నుండి జూన్ 4 వరకు జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి చర్చల్లో అమెరికా సెక్షన్ 301 దర్యాప్తుల నుండి వాణిజ్య ఉపశమనం పొందడం మరియు పోటీ దేశాల కంటే భారత్కు ప్రాధాన్యత మార్కెట్ ప్రాప్యత లభించేలా చూడటమే భారత వాణిజ్య బృందం యొక్క ప్రధాన అజెండాగా ఉంది.
Also Read:ఇది రాచరికం కాదు..రబ్రీపై సీఎం!

