భారత్‌పై సుంకాలు 18 శాతానికి తగ్గింపు

3
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్ట్‌లో మోదీని తన అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒకరు గా పేర్కొన్న ట్రంప్, భారత్‌పై విధించిన సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.

అదే పోస్ట్‌లో భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడానికి అంగీకరించిందని మోదీ చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటంపై పాశ్చాత్య దేశాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇకపై భారత్ అమెరికా నుంచి, అలాగే వెనిజువెలా నుంచి కూడా ఎక్కువగా చమురు కొనుగోలు చేయనుందని ట్రంప్ చెప్పారు.

ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడటం నాకు గౌరవంగా అనిపించింది. వాణిజ్యం సహా అనేక అంశాలపై, అలాగే రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై కూడా మేం చర్చించాం. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపి, అమెరికా నుంచి, అలాగే అవసరమైతే వెనిజువెలా నుంచి ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు. ఇది వేలాది ప్రాణాలు తీసిన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి సహాయపడుతుంది అని ట్రంప్ తెలిపారు.

మోదీపై ఉన్న గౌరవం, స్నేహం కారణంగానే సుంకాలను 18 శాతానికి తగ్గించానని ట్రంప్ చెప్పారు. అంతేకాకుండా అమెరికాపై భారత్ విధిస్తున్న సుంకాలు, నాన్‌-టారిఫ్‌ అడ్డంకులను సున్నాకు తగ్గించేందుకు కూడా భారత్ నిర్ణయించిందని తెలిపారు. సుంకాలు తగ్గించినందుకు ప్రధాని మోదీ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ట్రంప్ నాయకత్వం కీలకమని ప్రశంసించారు. ఆయన శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని, ట్రంప్‌తో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నానని చెప్పారు.

Also Read:ఐసీసీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం: బీసీసీఐ

- Advertisement -