99శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. గుజరాత్ ఎన్నికల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ భేటీ నేడు తెలంగాణ భవన్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అసెంబ్లీలో వ్యవహరించాల్సిన విధానాలపై పార్టీ శ్రేణులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహించేది లేదన్నారు. విప్లు సభలో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ది లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో దాదాపు మూడు గంటల పాటు సాగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కడియం ఎవరెవరు ఏయే బాధ్యతలు నెరవేర్చాలో సీఎం దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు.
పార్టీని పటిష్టం చేయాలని నూతన కార్యదర్శులకు సూచించారన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు తప్పకుండా సభలో ఉండాలి… శాసనసభ్యులు ప్రతీ సబ్జెక్టుపై అవగాహన కలిగి ఉండాలి.. శాసన సభ్యులు ప్రిపేర్ అవ్వాలన్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజే కాంగ్రెస్ ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడం బాధాకరమన్న కడియం…. ప్రజల సమస్యలపై చర్చించాలన్న తపన ఆపార్టీకి లేదన్నారు.
కాంగ్రెస్కు ఎజెండా లేదు.. క్లారిటీ లేదు.. కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్లో ఉంది.. ప్రతీ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ఇవాళ్టి బీఏసీలో సీఎం చెప్పారు. ఎన్ని రోజులైనా చర్చిద్దామని సీఎం ఓపెన్గా చెప్పినా విపక్షాలు వినలేదని ఆరోపించారు. శీతాకాల సమావేశాలను 50 రోజులు నడుపుతామంటే.. విపక్షాలు వ్యంగ్యంగా మాట్లాడాయని దుయ్యబట్టారు. మీడియా దృష్టిని ఆకర్షించాలన్న యావే తప్ప.. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు చిత్త శుద్ధి లేదన్నారు.