చిన్ననాటి ఐస్ గోలా తాతకు కేటీఆర్ భరోసా..

252
ktr
- Advertisement -

చిన్నప్పుడు తాను చదువుకున్న స్కూల్ వద్ద ఐస్ గోలా అమ్మిన తాతను కలిశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వృద్దాప్యంతో పనిచేయలేని స్థితిలో ఉన్న సయ్యద్ అలీని ఆదుకుంటానని కేటీఆర్ హామి ఇచ్చారు. రెండు వారాల క్రితం మహబూబ్ అలీ అనే యువకుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఒక ట్వీట్ చేశాడు.”కేటీఆర్ సాబ్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఐస్ గోలా అమ్మిన వ్యక్తి (చావూష్) మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు” అని.వెంటనే స్పందించిన కేటీఆర్ “తప్పకుండా కలుస్తాను. చావూష్ గురించి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి” అని బదులిచ్చాడు. ఎప్పుడో ముప్ఫై ఏళ్ల క్రితం ఆబిడ్స్‌లో గ్రామర్ స్కూళ్లో తను చదువుకునేటప్పుడు స్కూలు ముందు ఐస్ గోలా అమ్ముకునే సయ్యద్ అలీని ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశాడు.

 ktr

సయ్యద్ అలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశాడు. “ఇంకా ఐస్ గోలా అమ్ముతున్నావా, కుటుంబం పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది”? అని అడిగారు. తనకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని, గత సంవత్సరమే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యిందని, అయినా పొట్ట గడవడం కోసం ఇంకా ఆబిడ్స్ గ్రామర్ స్కూల్ వద్ద ఐస్ గోలాలు అమ్ముతున్నానని సయ్యద్ అలీ బదులిచ్చాడు. సయ్యద్ అలీకి ఉండడానికి నిలువ నీడ కూడా లేదని మాటల్లో తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్పందించి మీకు వెంటనే ఒక గృహం మంజూరు చేపిస్తానని మాట ఇచ్చారు.

అలాగే నెలవారీ వృద్దాప్య పెన్షన్ మంజూరు చేపిస్తానని, అతని కుమారులకు కూడా సరైన ఉపాధి చూపిస్తానని కేటీఆర్ మాట ఇచ్చారు. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడారు. కేటీఆర్ గారి గురించి చాలా విన్నానని, కానీ నిజంగా ఇలా కలుస్తానని తానెప్పుడూ అనుకోలేదని ఈ సందర్భంగా సయ్యద్ అలీ ఆనందం వ్యక్తం చేశారు. తన వ్యధలు విన్న వెంటనే స్పందించి ఆదుకోవడానికి ముందుకు వచ్చిన కేటీఆర్ కు సయ్యద్ అలీ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -