టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి..

245
Dora Swamy Raju passes away
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నినెలలుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నటుడు నర్సింగ్‌ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషాద సంఘటన మరవకముందే టాలీవుడ్‌లో మరోసారి విషాద ఛాయలు అలముకున్నాయి. ఈరోజు ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించగా, కొంతకాలంగా బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. అయితే, పరిస్థితి విషమించి, ఆయన తుది శ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.తెలుగు చిత్రసీమలో ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. ఆయన నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్, రాజకీయంగానూ రాణించారు.

సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అన్నమయ్య, సింహాద్రి, భలే పెళ్లాం, వెంగమాంబ వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ఇక వీఎంసీ పేరిట డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించిన ఆయన, అదే బ్యానర్ పై ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్ నటించిన వేటగాడు, యుగంధర్, డ్రైవర్ రాముడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలతో పాటు ఏఎన్నార్ నటించిన ప్రేమాభిషేకం చిత్రాలను దొరస్వామి వీఎంసీ ద్వారా విడుదల చేశారు. కాగా, 90వ దశకంలో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి, 1994లో చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దొరస్వామి రాజు మరణ వార్తను గురించి తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -