రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దూల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయ హత్య ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ హత్యను పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా తహశీల్దార్ విజయ హత్యోదంతంపై తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారుల పెన్షనర్ల మరియు కార్మికుల ఐక్యత కార్యాచరణ సమితి ప్రగాఢ సానుభూతి తెలిపింది.
తహశీల్దార్ విజయ హత్య తమను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు బాధాకరమని ఉద్యోగ జేఏసీ నేతలు కారం రవీందర్ రెడ్డి, వి.మమతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించే ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పై ఇలాంటి సంఘటన జరగటం దురదృష్టకరమని, ప్రజలను ఆపద సమయంలో ఆదుకునే అధికారిపై దాడి జరగడం అమానుషం, నేరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించి ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని తెలంగాణ ఉద్యోగుల జెఎసి నేతలు డిమాండ్ చేశారు.
విజయ కుటుంభాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని వారు పేర్కొన్నారు. విజయ మృతికి వారు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగ జేఏసీ విజయ కుటుంబానికి అండగా ఉంటుందని, హత్యకు పాల్పడిన నిందితుడికి శిక్ష పడేదాకా ఉద్యోగ జేఏసీ పోరాటం చేస్తుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.