తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీలో ప్రజా పాలన లేదు అన్నారు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లభించలేదు…గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఆంక్షలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. ఏప్రిల్ 22వ తేదీ (బుధవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ (JAC) అధికారికంగా ప్రకటించింది.
మార్చి 13నే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ, యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ చర్చలకు చొరవ చూపలేదు. కార్మికుల సహనాన్ని పరీక్షించవద్దని, తమ 32 డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే:
ఆర్టీసీ జేఏసీ మొత్తం 32 డిమాండ్లతో కూడిన చార్టర్ను సమర్పించింది. అందులో ప్రధానమైనవి:
ప్రభుత్వంలో విలీనం: ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలి.
యూనియన్ ఎన్నికలు: చాలా కాలంగా నిలిచిపోయిన కార్మిక సంఘాల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలి.
వేతన సవరణ (PRC): ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణను అమలు చేయాలి.
ALso Read:కర్నె ప్రభాకర్కు సంతోష్ పరామర్శ
పెండింగ్ బకాయిలు: పీఎఫ్, సీసీఎస్ బకాయిలతో పాటు పెండింగ్లో ఉన్న డీఏ (DA) లను వెంటనే విడుదల చేయాలి.
ఉద్యోగ భద్రత: కారుణ్య నియామకాలు చేపట్టడం మరియు అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడం.
ఈ సమ్మె ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా ఉండనుంది. సుమారు 6,000కు పైగా బస్సులు నిలిచిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ప్రతిరోజూ ఆర్టీసీపై ఆధారపడే దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ సమ్మె సామాన్యులపై భారం కానుంది.

