హైడ్రా అధికారుల చర్యలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ భూమిలో అనుమతి లేకుండా ఫెన్సింగ్ వేయడంపై కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఉప్పల్–మల్లాపూర్ పరిధిలోని భాభానగర్ సొసైటీలో ఉన్న రెండు 500 చదరపు గజాల ప్రైవేట్ ప్లాట్లకు హైడ్రా అధికారులు కంచె వేసిన ఘటన వివాదాస్పదమైంది.
తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేశారని ఆరోపిస్తూ ప్లాట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, హైడ్రా చర్యలను తప్పుబట్టింది. వెంటనే కంచె తొలగించాలని ఆదేశిస్తూ, ఇప్పటికే జరిగిన చర్యపై రూ.1 లక్ష జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని పిటిషనర్లకు చెల్లించాలని స్పష్టం చేసింది.
అంతేకాకుండా, కంచె పూర్తిగా తొలగించే వరకు ప్రతిరోజూ రూ.1 లక్ష చొప్పున పిటిషనర్లకు చెల్లించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అధికారుల నిర్లక్ష్య చర్యలు పౌరుల ఆస్తి హక్కులను ఉల్లంఘించకూడదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ తీర్పుతో హైడ్రా విధానాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వ సంస్థలు చట్టబద్ధంగా, పారదర్శకంగా వ్యవహరించాలని న్యాయస్థానం హెచ్చరించింది.
Also Read:కొడుకు పెళ్లి వేడుకలో సచిన్ ఎమోషనల్!

