యుద్ధ కల్లోల లిబియాలో ఏడాదికి పైగా ఉగ్రవాదుల నిర్భందంలో ఉండి ఇటీవలే విడుదలయిన ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరామకిషన్ శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. విదేశాంగశాఖ అధికారులు వీరిని హైదరాబాద్ తీసుకొచ్చారు. నాచారం రాఘవేంద్ర కాలనీలోని స్వగృహానికి గోపీకృష్ణ, తిరుమలగిరిలోని స్వగృహానికి బలరాంకిషన్ చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా ప్రొఫెసర్లు కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా విడుదలయ్యారు.
గతేడాది జులై 29న ఈ ఇద్దర్ని లిబియాలో ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. మా కుటుంబాలను కలుసుకున్నందుకు ఆనందంగా ఉందని వారు తెలిపారు. 414 రోజులు ఐఎస్ఐఎస్ చెరలో ఉన్నామని పేర్కొన్నారు. తమను కిడ్నాప్ చేసినప్పటి నుంచి విడుదల చేసే వరకు జరిగిన పరిణామాలపై, అక్కడి పరిస్థితులపై సమాచారాన్నంతా భారత విదేశాంగ శాఖకు తాము ఇచ్చామని పేర్కొన్నారు.