ప్రభుత్వ పాలనలో ప్రణాళికా శాఖ పాత్ర కీలకం..

264
- Advertisement -

ప్రభుత్వ దైనందిన పాలనలో రాష్ట్ర ప్రణాళికా శాఖ పాత్ర అతి కీలకమని, ప్రభుత్వ ప్రతి శాఖకు దిక్సూచిగా నిలుస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం గణాంక భవన్ లో ” తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ ” పుస్తకాన్ని రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావుతో కలిసి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్రానికి సంబంధించిన జీఎస్డీపీ అంచనాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివిధ పథకాలు, పలు సర్వే గణాంక సమాచారం, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి వివరాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రణాళికా శాఖ ముఖ్య భూమికను పోషిస్తోందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర కార్యాచరణ సమాచారాన్ని క్రోడీకరించి పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకుని రావడం గొప్ప విషయమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమగ్ర సమాచారం http://tsdps.telangana.gov.in అనే వెబ్ సైటు లో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు విధిగా ఈ వెబ్ సైటు ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించాలని, ఆయా సమావేశాల్లో ఈ గణాంకాలను ప్రజలకు వివరించాలని వినోద్ కుమార్ సూచించారు. గ్రామ స్థాయి సమగ్ర సమాచారంతో ప్రత్యేకంగా పుస్తకాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. రోడ్ అట్లాస్ పై దృష్టిని సారించాలని కూడా ఆయన సూచించారు.

రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ అన్ని శాఖలకు ఉపయోగపడేలా సమగ్ర గణాంక వివరాలతో పుస్తకాన్ని ప్రచురించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామ స్థాయి సమాచారంతో పుస్తకాన్ని తీసుకుని రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ( టీ.ఎస్.డీ.పీ.ఎస్ ) సీఈ.ఓ. జీ. దయానంద్, రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీనివాస్ రెడ్డి, సిజిస్ సంస్థ ప్రతినిధి రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -